
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఆరు మ్యాచ్లలో ఓడిపోయింది. నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 11పరుగుల తేడాతో ఓడింది. ఈ సీజన్లో నాలుగో మ్యాచ్లో గెలిచిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా.. చెన్నై 9వ స్థానంలోనే కొనసాగుతుంది. పంజాబ్ విధించిన 188పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై 20ఓవర్లలో 176/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. బ్యాటర్ అంబటి రాయుడు 7ఫోర్లు, 6సిక్సర్లతో 39బంతుల్లో 78పరుగులతో వీరవిహారం చేసినప్పటికీ.. చెన్నైలోని మిగతా బ్యాటర్లు రాణించలేదు. దీంతో ఛేజింగ్లో చెన్నై వెనకబడిపోయింది. 4-0-23-2బౌలింగ్ ప్రదర్శనతో పంజాబ్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఈ మ్యాచ్లో సత్తా చాటగా.. ఇంజూరీ కారణాల వల్ల క్రికెట్కు దూరమై తిరిగి ఎంట్రీ ఇచ్చిన రిషి ధావన్ 2వికెట్లు, అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ సహా మంచి డెత్ బౌలింగ్ వేయడంతో పంజాబ్ కింగ్స్ గెలిచింది.
ఈ మ్యాచ్ ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. సీజన్లో ఇప్పటికి ఆరు ఓటములు మూటగట్టుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో చెన్నైకి మరో ఆరు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దశలో ప్లేఆఫ్కు అర్హత సాధించాలంటే రవీంద్ర జడేజా సేన.. ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. మిగిలిన ఆరు మ్యాచ్లలో చెన్నై గెలిస్తే మొత్తం చెన్నై 8విజయాలు సాధించినట్లవుతుంది. అప్పుడు 16పాయింట్లు వస్తాయి. దాదాపుగా ప్లేఆఫ్కు వెళ్లే అవకాశముంటుంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడకుండా వరుసగా 6 మ్యాచ్లు గెలవడం.. అది కూడా ఇప్పుడు ఉన్న చెన్నై ఫామ్ బట్టి చూస్తే అత్యంత కష్టం. ఒకవేళ 5మ్యాచ్లు గెలిస్తే 7విజయాలు సాధించినట్లవుతుంది. గతంలో 7విజయాలు సాధించి 14పాయింట్లతో కొన్ని జట్లు ప్లేఆఫ్ చేరాయి. ఆ సందర్భాల్లో నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం చెన్నై నెట్ రన్ రేట్ -0.538గా ఉంది. కాబట్టి ఒకవేళ 5 మ్యాచ్లు గెలిచినా.. భారీ తేడాతో గెలుపొందాలి. మరో విషయం ఏంటంటే.. ప్రస్తుతం పది టీంలు ఉన్నందున ఇతర జట్ల జయాపజయాలు చెన్నై ప్లేఆఫ్ అవకాశాలను బాగా ప్రభావితం చేస్తాయి. ఇక చెన్నై మిగిలిన మ్యాచుల్లో రెండు మ్యాచ్లు ఓడిపోతే.. ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లవుతుంది. మే 1న పూణేలో చెన్నై తన తదుపరి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. వరుసగా విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న సన్ రైజర్స్పై చెన్నై గెలవడం కష్టమే.

చెన్నై ఆరు మ్యాచ్లలో ఓడిన అనంతరం ప్లేఆఫ్ అవకాశాలు జట్ల వారీగా ఏవిధంగా ఉన్నాయో ఓ సారి అంచనా వేస్తే.. గుజరాత్ - 89%, సన్రైజర్స్ - 70%, రాజస్థాన్ - 70%, లక్నో - 57%, బెంగళూరు - 57%, పంజాబ్ - 28%, ఢిల్లీ - 18%, కోల్కతా - 9%, చెన్నై - 2%, ముంబై - 0.0002%. గుజరాత్ మరో రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు.. ప్లేఆఫ్ చేరుతుంది. కాగా.. మిగతా జట్లు ప్లేఆఫ్ రేసులో తీవ్రంగా పోటీపడుతున్నాయి. అందులో రాజస్థాన్, సన్రైజర్స్కు ప్లేఆఫ్ రేసులో కొంచెం బెటర్ అవకాశాలున్నాయి. లక్నో, బెంగళూరు జట్లకు కూడా మంచి అవకాశాలున్నాయి. ఇక పంజాబ్, ఢిల్లీ, కోల్కతా ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్లో గెలవడం కీలకం. చెన్నై ఒక్క మ్యాచ్ ఓడినా దాదాపు ఆశలు గల్లంతవుతాయి.