
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో అంతగా రాణించలేకపోతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై నెటిజన్లు ట్వీట్లతో మరోసారి రెచ్చిపోతున్నారు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో ఓడి ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్షిష్టం చేసుకున్న ఆర్సీబీపై అభిమానులు జోకులు పేల్చుతున్నారు. పాయింట్ల పట్టికలో పైకి, కిందికి మారాడాన్ని ప్రస్తావిస్తూ తమ ఫోటో మార్ఫింగ్ నైపుణ్యం జోడించి మరీ ట్వీట్లు చేస్తున్నారు.
ఆర్సీబీ ఓటములను కర్ణాటక ఎన్నికలకు ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ వైఫల్యానికి పూర్తి బాధ్యత సిద్దరామయ్యదేనని మోడీ అన్నట్లు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్సీబీపై ఏ జట్టు గెలవదని పేర్కొన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతీ ఐపీఎల్ల్లో ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. జట్టు సభ్యులే వెన్నుపోటు పొడుస్తున్నారని, కట్టప్ప-బాహుబలి ఫొటోను ట్వీట్ చేస్తున్నారు.
పరీక్షల్లో ఎంత కష్టపడ్డా మార్కులు రానట్లు.. ఆర్సీబీ ఎంత బాగా ఆడిన ఓడిపోతుందని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తొమ్మిది మ్యాచుల్లో మూడు మాత్రమే నెగ్గిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. టోర్నీలో నిలవాలంటే ఆర్సీబీ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే.
మరో వైపు కోహ్లీ వికెట్ తీసిన రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీల ఫోటోలను జోడించి.. నా వికెట్ ఎందుకు తీశావ్ అని కోహ్లీ అడుగుతుంటే, దానికి బదులుగా రవీంద్ర జడేజా తప్పై పోయింది. సోదరా అనుకోకుండా వికెట్కు తగిలేసింది. అని మరో సరదా ట్వీట్ చేశాడు. మరో వైపు ఇంద్ర సినిమాలో చిరంజీవి ఫోటోను కమెడియన్ ఎమ్మెస్ నారాయణ ఫొటోను ఉంచి ఐపీఎల్కు ముందు హీరోలా ఉన్న ఆర్సీబీ ఐపీఎల్ ఆడుతూ కమెడియన్గా మారిపోయిందంటూ ట్వీట్ చేశాడు.