
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా హేమంగ్ అమీన్ నియమితులయ్యారు. అమీన్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. రాహుల్ జోహ్రీ బీసీసీఐ సీఈవోగా రాజీనామా చేయడంతో.. ఆ పదవి ఖాళీగా ఉంది. రెండు నెలల్లో కొత్త సీఈవోను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నది. అప్పటి వరకూ అమీన్.. తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
హేమంగ్ అమీన్ను తాత్కాలిక సీఈవోగా నియమించినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా బోర్డు అనుబంధ సంస్థలకు అంతర్గతంగా సమాచారం అందించినట్లు సమాచారం. 2017 నుంచి ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అమీన్ పనిచేశారు. బోర్డు తన మొట్టమొదటి సీఈవోని నియమించడంలో కన్సల్టింగ్ ఏజెన్సీ కార్న్ ఫెర్రీ సహాయం కోరింది. అయితే ఈసారి బోర్డు ఏ ఏజెన్సీని సహాయం లేకుండా సొంతంగా నియమించుకునే అవకాశం ఉంది. కొత్త సీఈవోకి మాత్రం రాహుల్ జోహ్రీకి ఉన్నంత పారితోషికం ఉండకపోవచ్చని సమాచారం.
బీసీసీఐతో రాహుల్ జోహ్రి బంధం ఇటీవలే ముగిసింది. అతడి రాజీనామాను బోర్డు ఆమోదించింది. 2016లో బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా జోహ్రి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు నియమించిన బోర్డు పాలకుల కమిటీ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బోర్డుకు పూర్తి అధికారాలు అప్పగించిన వెంటనే.. జోహ్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆమోదించని బోర్డు.. 2021లో ఒప్పందం ముగిసేవరకు బాధ్యతల్లో కొనసాగాలని జోహ్రిని కోరింది. నిరుడు డిసెంబరు 27న మరోసారి అతడు రాజీనామా చేశాడు. చాలాకాలం పెండింగ్లో ఉన్న అతడి రాజీనామాను తాజాగా బోర్డు ఆమోదించింది.
రాహుల్ జోహ్రి పదవీ కాలం 2021 వరకు ఉండగా.. అప్పుడే ఆయన రాజీనామా చేయడం విశేషం. దీనికి బీసీసీఐ బోర్డు అధికారులు ఎలాంటి కారణం చూపలేదు. అయితే జోహ్రి ఇటీవల కావాలనే బోర్డు అంతర్గత ఇ-మెయిల్స్ను బయటపెట్టారని, బోర్డు ఆయనపై నమ్మకం కోల్పోయిందని సమాచారం తెలుస్తోంది.