హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ సొంత మైదానం బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోని తన పవర్ఫుల్ హిట్టింగ్ను చూపించాడు. ఐపీఎల్లో భాగంగా ఆదివారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని కొట్టిన ఓ సిక్స్ స్టేడియం బయట పడింది. ఐపీఎల్ పదో సీజన్లో ఇదే అతి పెద్ద సిక్స్ కావడం విశేషం. చాహల్ వేసిన 14వ ఓవర్ చివరి బంతిని ధోనీ కసితో బాదడంతో బంతి స్టేడియం పైకప్పు మీద పడింది. అప్పటి వరకు ఆర్సీబీ.. ఆర్సీబీ.. అని కేరింతలు కొట్టిన అభిమానులు ఒక్కసారిగా ధోనీ.. ధోనీ అని అరవడం ప్రారంభించారు.
ఆ తర్వాత బెంగళూరు ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి ధోనీ బౌల్డయ్యాడు. ఈ సీజన్లో మొదటి నుంచి పేలవ ప్రదర్శనను కనబరుస్తున్న ధోని ఈ మ్యాచ్లో తన బ్యాట్కు కాస్త పని చెప్పాడు. ఈ మ్యాచ్లో 25 బంతుల్లో 28 పరుగులు చేశాడు.