విశ్వవేదికపై భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ సేన సగర్వంగా స్వదేశానికి చేరుకుంది. అయితే టీమిండియాను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. తుఫాను కారణంగా నాలుగు రోజుల పాటు బార్బడోస్లోనే ఉన్న భారత జట్టుకు మరోసారి వరుణుడు షాకిస్తున్నాడు. విజయోత్సవాలు చేయకుండా అడ్డుపడుతున్నాడు. మరికాసేపట్లో విజయోత్సవ ర్యాలీ ప్రారంభంకానున్న సమయంలో వాంఖడే స్టేడియం సమీపంలో భారీ వర్షం పడుతోంది. దీంతో ఓపెన్టాప్ బస్సు ర్యాలీపై సందిగ్థత నెలకొంది.
గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తెరదించుతూ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నాలుగు రోజుల ముందే భారత జట్టు స్వదేశానికి చేరుకోవాల్సి వస్తుంది. కానీ వెస్టిండీస్లో భీకర తుఫాను కారణంగా బార్బడోస్లోనే మంగళవారం వరకు ఉన్నారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బుధవారం బయల్దేరి గురువారం తెల్లవారుజామును ఢిల్లీకి చేరుకున్నారు.

తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు చేరున్నారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు మాస్ డ్యాన్స్ వేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానితో కలిసి అల్ఫాహారం తిన్నారు. విశ్వవేదికపై భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను మోదీ అభినందించారు. ఆ తర్వాత తిరిగి ముంబైకి బయల్దేరారు. సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. కానీ భారీ వర్షం కురుస్తుండటంతో ఈ కార్యక్రమం ఆలస్యమయ్యేలా ఉంది.
అయితే వరుణుడు కరుణించకపోతే ర్యాలీ నిర్వహిస్తారా? మరో రోజుకు కార్యక్రమానికి వాయిదా వేస్తారా అనేదే అసలు ప్రశ్న. కాగా, తేలికపాటి జల్లులు అయితే ర్యాలీని కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానుల ప్రేమ కోసం ఆటగాళ్లు కూడా వర్షంలో తడిసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే భారీ వర్షం పడితే ర్యాలీని రద్దు చేసి వాంఖడే స్టేడియంలో జరిగే సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించే యోచనలోనూ బీసీసీఐ ఉంది.