ఇంగ్లాండ్ పై 3-0తేడాతో వన్డే సిరీస్ ను దక్కించుకుని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బరిలోకి దిగుతోంది టీమిండియా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి రావడం భారత జట్టులో మరింత విశ్వాసాన్ని నింపింది. అయితే ఇప్పుడు భారత జట్టులో మిడిలార్డర్ గురించి ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయంలో పంత్, శ్రేయస్ అయ్యర్ ఎంపికలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య కూడా మరోసారి మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.
పంత్ వర్సెస్ కేఎల్ రాహుల్..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నెం.1 వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ కే తొలి ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, గంభీర్ మాత్రం కేఎల్ రాహుల్ ను ఎంచుకుని,అతడినే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ ను ఆడించాడు. దీంతో రిషభ్ పంత్ బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ విషయంలో గంభీర్, అగార్కర్ మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలిసింది. పైగా గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ కేఎల్ రాహుల్ నంబర్వన్ వికెట్ కీపర్ అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

శ్రేయస్ను తీసుకోవడంపైనా..
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను ఆడించారు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్థానంలో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ మంచిగా రాణించి హాఫ్ సెంచరీతో ప్రశంసలు అందుకున్నాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి నెలకొంది. మిడిలార్డర్లో శ్రేయస్ కీలకంగా మారతాడని భావించిన మేనేజ్మెంట్.. అతడికి తోడుగా అక్షర్ పటేల్ను ముందుకు తీసుకొచ్చింది.
అయితే రైట్ - లైఫ్ట్ కాంబినేషన్ అంటూ బరిలోకి దిగితే ప్రత్యర్థికి ఇబ్బందికరమని గంభీర్ ఆలోచన. అందుకు తగినట్టే అక్షర్ను ఐదో స్థానానికి తీసుకొచ్చి.. కేఎల్ రాహుల్ను ఆరో ప్లేస్ కు పంపించాడు. కానీ, జట్టుకు ఇది ప్రయోజనంగా మారినప్పటికీ.. వ్యక్తిగతంగా కేఎల్ ప్రదర్శనపై ప్రభావం చూపించింది. దీంతో చివరి వన్డేలో మళ్లీ కేఎల్ రాహుల్ ను ఐదో స్థానంలోనే పంపించాల్సి వచ్చింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం అక్షర్నే ఐదో స్థానంలో ఆడించడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయంలోనూ గంభీర్ - అగార్కర్ మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగినట్లు సమాచారం.