2024 ఏడాది.. భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. జగజ్జేతగా నిలిచామని రొమ్మువిరిచి గర్వంగా చెప్పుకున్న నాలుగు నెలలకే ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ను రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు గెలిచిన సంగతి తెలిసిందే. అదే రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా కోరుకోని రికార్డు నమోదు చేసింది. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు సాధించింది.
సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తొలిసారి వైట్వాష్కు గురైంది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో రోహిత్ కెప్టెన్సీని- కోహ్లి అనుభవాన్ని మెచ్చుకున్న అభిమానులు ఇప్పుడు దారుణంగా దూషిస్తున్నారు. అయితే అభిమానుల ప్రశంసలకు, విమర్శలకు కొన్ని సరైన కారణాలూ ఉన్నాయి. కెప్టెన్ రోహిత్కు తనపై, జట్టుపై ఉన్న నమ్మకం అతినమ్మకంగా మారిందనుకుంటా.. ప్రత్యర్థికి అస్త్రాలు అందించి నిరాయుధంగా టీమిండియాను పోరాడేలా చేశాడు.

టాస్ గెలిచి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. బలహీనమైన బంగ్లాదేశ్తో అంటే అది చెల్లింది. కానీ న్యూజిలాండ్కు మరింత బలాన్ని అందిచ్చింది. కివీస్ బౌలర్ల ముందు మన బ్యాటర్లు తేలిపోయి 46 పరుగులకే ఆలౌటయ్యారు. రెండో టెస్టుకు రోహిత్ పిచ్తో సహా వ్యూహాలు మార్చాడు. పేస్కు బదులుగా స్పిన్తో ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎటాకింగ్ ఫీల్డింగ్కు బదులుగా డిఫెన్స్ ఫీల్డింగ్ మోహరించాడు. అంటే ప్రత్యర్థికి బౌండరీలు రాకుండా ఫీల్డింగ్ సెటప్ చేశాడు.
టీ20ల్లో ఇది వర్కౌట్ అయ్యింది కానీ సుదీర్ఘ ఫార్మాట్లో పనిచేయలేదు. కివీస్ బ్యాటర్లు సులువుగా స్ట్రైక్రొటేట్ చేస్తూ మన బౌలర్లపైనే ఒత్తిడి తీసుకువచ్చారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అప్పటికప్పుడు మార్పులు... లెఫ్ట్-రైట్ హ్యాండ్ కాంబినేషన్ తీసుకురావడానికి ప్రయత్నించడం, సర్ఫరాజ్ను ఆర్డర్లో వెనక్కి పంపడం.. ఇలా రోహిత్ అన్ని ప్లాన్స్ అట్టర్ ఫ్లాపే. ఇక ఈ సిరీస్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ పరిస్థితి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. 15.16 సగటుతో 91 పరుగులు చేశాడు.
పరిస్థితుల పట్టించుకోను.. దూకుడే తన మంత్రం అంటూ రోహిత్ షాట్కు ప్రయత్నించడం, వెనుదిరగడం సర్వసాధారణమైంది. నడిపించాల్సిన నాయకుడే పట్టుమని పది నిమషాలు పాటు క్రీజులో ఉండకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక గతంలో భారత ఇన్నింగ్స్కు ఇరుసుగా మారి పరుగుల ప్రవాహం పారించే విరాట్ కోహ్లి వీరత్వం కనుమరుగైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ల అంటే వణికిపోతున్నాడు. స్పిన్లో వికెట్ సమర్పించుకోవడం కోసం పోటీపడుతున్నాడు. 2020 నుంచి స్వదేశంలో స్పిన్నర్ల బౌలింగ్లో 39 ఇన్నింగ్స్ల్ కోహ్లి ఏకంగా 27 సార్లు ఔటయ్యాడు.
కోహ్లి ఫుట్వర్క్ పేలవంగా మారిందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ సిరీస్లో కోహ్లి 15.50 సగటుతో 93 పరుగులు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సాధించిన 70 పరుగుల మినహాయిస్తే .. కోహ్లి సగటు అత్యంత దారుణంగా ఉంటుంది. దిగ్గజాలుగా దశాబ్దం కాలం పాటు భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కోహ్లి-రోహిత్.. ప్రస్తుతం జట్టుగా భారంగా మారడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ హేళనలు భరించడం తమ వల్ల కాదని, బీసీసీఐ వేటు వేయకముందే.. ఉన్నతంగా తప్పుకోవాలని 36 ఏళ్ల కోహ్లి, 37 ఏళ్ల రోహిత్ను కోరుతూ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.