వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై ఆధిపత్యం చెలాయిస్తోంది. విదర్భకు కొండంత లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ప్రస్తుతం మూడో రోజు ఆటలో టీ విరామానికి 109.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. మొత్తంగా 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముషీర్ ఖాన్ (136; 326 బంతుల్లో, 10×4) శతకంతో చెలరేగాడు. అజింక్య రహానె (73; 143 బంతుల్లో, 5×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే శ్రేయస్ అయ్యర్ (95; 111 బంతుల్లో, 10×4, 3×6) తృటిలో సెంచరీ కోల్పోయాడు. సిక్సర్తో శతకం సాధించాలనుకున్న అతడికి నిరాశే మిగిలింది. ఆదిత్య ఠాక్రే ఆఫ్ స్టంప్ వైపుకు వేసిన బంతిని శ్రేయస్ భారీ షాట్కు యత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయానికి శ్రేయస్ బ్యాట్ గ్రిప్ చేజారింది. దీంతో నియంత్రణతో షాట్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత తన చేతుల్లో నుంచి బ్యాటు కూడా కిందపడిపోయింది. మరోవైపు లాంగాన్లో ఉన్న అమన్ క్యాచ్ను అందుకున్నాడు.

అనంతరం నిస్సహాయంగా శ్రేయస్ మైదానాన్ని వీడాడు. దూకుడుగా కాకుండా నిదానంగా ఆడటానికి ప్రయత్నించి ఉంటే శ్రేయస్ శతకాన్ని సాధించేవాడు. ఇటీవల టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇలాంటి ప్రతికూలత మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ శ్రేయస్ ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు పరుగులే సాధించిన శ్రేయస్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
కాగా, ఓవర్నైట్ స్కోరు 141/2తో ఇవాళ ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే ముంబై వికెట్ కోల్పోయింది. అజింక్య రహానె (73; 143 బంతుల్లో)ను హర్ష్ దూబె పెవిలియన్కు చేర్చాడు. అయితే అంపైర్ ఔట్ అని ప్రకటించకముందే రహానె క్రీడాస్ఫూర్తితో మైదానాన్ని వీడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. 62 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ముషిర్ ఖాన్తో కలిసి నాలుగో వికెట్కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు ముషీర్ ఖాన్ నిలకడగా పరుగులు కొనసాగించాడు. 255 బంతుల్లో సెంచరీ బాదాడు. టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్.