
కరాచీ: 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ జట్టు పాకిస్థాన్లో ఇటీవలే తొలిసారి పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడింది. కరాచీ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరిస్ను 2-0తో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ కైవసం చేసుకోగా.. మూడు టీ20ల సిరిస్ను మాత్రం శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. టీ20ల సిరీస్లో పాకిస్తాన్ వైట్వాష్ కావడంతో ఆ జట్టు ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్పై విమర్శల వర్షం కురుస్తోంది.
టీ20 ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఇప్పుడే భాద్యతలు చేపట్టిన మిస్బావుల్పై అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మిస్బావుల్ను ఒకవైపు అభిమానులు ఆడుకుంటుండగా.. మరోవైపు పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు తమ వైఖరితో అతనికి తలపోటుగా మారారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని పలువురు క్రికెటర్లు క్రమశిక్షణ విషయంలో సరైన వైఖరిని ప్రదర్శించలేకపోవడం, ప్రాక్టీస్ చేయడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే మిస్బావుల్ తలపోటుకు అసలు కారణం.
తాజాగా పీసీబీలోని ఉన్నతస్థాయి అధికారి మాట్లాడుతూ... 'కొంతమంది పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్ను తేలిగ్గా తీసుకోవడమే కాకుండా రిలాక్స్డ్గా ఉంటున్నారు. ఇది మిస్బావుల్కు మింగుడు పడటం లేదు. ఒకవైపు తమ క్రికెట్ క్రమశిక్షణా ప్రమాణాలను పెంచాలని మిస్బా చూస్తున్నా.. అందుకు ఆటగాళ్ల నుంచి సహకారం లభించడం లేదు. ఈ విషయంను కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు' అని అన్నాడు.
'జట్టులో ఎవరైతే క్రమ శిక్షణలో భాగమైన ప్రాక్టీస్ను చిన్నచూపు చూస్తున్నారో వారిని సర్ఫరాజ్ మందలించే ప్రయత్నం కూడా చేయడం లేదు. వారంటే సర్ఫరాజ్ భయపడుతున్నాడు. వహాబ్ రియాజ్, ఇమాద్ వసీం, హరీస్ సొహైల్ల వ్యవహారం మిస్బాను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎప్పుడూ ఏదో వంకతో ప్రాక్టీస్ను తప్పించుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో మ్యాచ్కు సంబంధించి ప్రణాళికల్లో భాగం కావడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. దీంతో మిస్బా నిరాశ చెందుతున్నాడు. త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి' అని సదరు పీసీబీలో అధికారి పేర్కొన్నాడు.