మరో వారం రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది కూడా తమ ఫ్రాంచైజీలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కూడా కోల్కతా నైట్ రైడర్స్ క్యాంప్కు చేరుకున్నాడు. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న గంభీర్ ఈ సీజన్లో కోల్కతా ఫ్రాంచైజీతో కలిసి పనిచేయనున్న విషయం తెలిసిందే.
గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండు సార్లు ఛాంపియన్గా నిలిచింది. 2012, 2014 సీజన్లలో ట్రోఫీని గెలిచింది. అయితే ఈ సీజన్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ సంచలనంగా మారతాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. స్టార్క్ తమ జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్ అని పేర్కొన్నాడు. వేలంలో స్టార్క్ను కోల్కతా రూ.24.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన అతడు పది రెట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని సొంతం చేసుకోవడం విశేషం. స్టార్క్ కోసం మొదట ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ హోరాహోరీగా తలపడ్డాయి. రూ.9.8 కోట్ల దగ్గర కోల్కతా నైట్రైడర్స్ రేసులోకి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ కూడా ప్రవేశించడంతో స్టార్క్కు భారీ డిమాండ్ దక్కింది. చివర వరకు రేసులో ఉన్న కోల్కతా ఆఖరికి పంతం నెగ్గించుకుంది.
''కోల్కతా నైట్ రైడర్స్ నాకు ఫ్రాంచైజీ మాత్రమే కాదు, ఓ ఎమోషన్. ఇక్కడకు తిరిగి చేరుకోవడం ఆనందంగా ఉంది. మాపై అంచనాలు భారీగా ఉన్నాయని తెలుసు. వాటిని అందుకుని ఫ్యాన్స్ను సంతోషపెడతామని భావిస్తున్నా. అయితే భారీ ధర సొంతం చేసుకున్నందుకు మిచెల్ స్టార్క్కు ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ఎలాంటి సేవలు అందించాడో కేకేఆర్కు అలానే చేస్తాడని భావిస్తున్నా'' అని గంభీర్ పేర్కొన్నాడు.
మార్చి 23న ఈడెన్గార్డెన్స్లో కోల్కతా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. సన్రైజర్స్తో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అందుకోనున్నాడు. గాయం కారణంగా గత సీజన్కు అతను దూరమైన విషయం తెలిసిందే.