'సచిన్కు రెండు పాయింట్లు, నాకేమో వరల్డ్కప్ కావాలి'

హైదరాబాద్: వరల్డ్కప్లో టీమిండియా ఆడకుండా పాకిస్థాన్కు రెండు పాయింట్లు అప్పగించడాన్ని వ్యక్తిగతంగా అసహ్యించుకుంటానన్న సచిన్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. సచిన్కు కేవలం రెండు పాయింట్లు మాత్రమే కావాలని, కానీ తనకు భారత్ వరల్డ్కప్ గెలవడం కావాలని గంగూలీ చెప్పుకొచ్చాడు.

రౌండ్ రాబిన్ పద్దతిలో
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనుంది. రౌండ్ రాబిన్ విధానం ప్రకారం వరల్డ్ కప్లో పాల్గొనే ప్రతి జట్టు మిగతా తొమ్మిది దేశాలతో ఓ మ్యాచ్ని ఆడాల్సి ఉంటుంది. తాజాగా ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "10 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీలో ప్రతీ దేశం.. ఇతర దేశాలతో ఆడుతుంది" అని అన్నాడు.

పాక్తో జరిగే ఒక్క మ్యాచ్ ఆడకపోవడం వల్ల
అలాంటప్పుడు పాక్తో జరిగే ఒక్క మ్యాచ్ ఆడకపోవడం వల్ల కలిగే పెద్ద నష్టం ఏమిలేదని గంగూలీ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మే30 నుంచి వరల్డ్కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

స్పష్టమైన నిర్ణయం తీసుకోని బీసీసీఐ
దీంతో మ్యాచ్ ఆడటంపై ఇప్పటి వరకూ స్పష్టమైన నిర్ణయం తీసుకోని బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. భారత్ జట్టు ఒకవేళ పాక్తో మ్యాచ్ను బహిష్కరిస్తే? అప్పుడు పాకిస్థాన్ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. మరోవైపు సచిన్, గవాస్కర్లు.. పాక్తో భారత్ మ్యాచ్ ఆడి ఓడించాలని అంటున్నారు.

మియందాద్ వ్యాఖ్యలపై గంగూలీ
కాగా, ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న గంగూలీ పబ్లిసిటీ స్టంట్ కోసమే భారత్.. పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకోవాలంటున్నాడని పాక్ మాజీ క్రికెటర్ మియందాద్ చేసిన వ్యాఖ్యలపై సైతం దాదా స్పందించాడు. "నేను మియందాద్ వ్యాఖ్యలపై స్పందించాలనుకోవడం లేదు. కానీ అతని బ్యాటింగ్ను మాత్రం ఆస్వాదించేవాడిని. పాక్లో అతనో అద్భుతమైన ఆటగాడు" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications