IND vs NZ: ఆదివారం భారత్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో వరుణ్ చక్రవర్తి తమ జట్టుకు అతిపెద్ద ముప్పు అని న్యూజిలాండ్ జట్టు ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ అంగీకరించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ను ఎదుర్కోవాలంటే.. తన జట్టు ఆలోచనను విస్తరించాల్సి ఉంటుదని స్టీడ్ అన్నారు. న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్ లో వరుణ్ 42 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడని స్టీడ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ చాలా మంచి బౌలర్ అని.. కివీస్ తో జరిగిన చివరి మ్యాచ్ లో తన నైపుణ్యాలను అద్భుతంగా చూపించాడని ప్రశంసించాడు. ఈ మ్యాచ్ లో వరుణ్ మాకు అతిపెద్ద ముప్పు అని.. కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఎలా స్కోర్ చేయవచ్చో దానిపై ఆలోచనను కేంద్రీకరించాలని కివీస్ జట్టుకు సూచించారు.
లీగ్ మ్యాచ్ నుంచి న్యూజిలాండ్ నేర్చుకుంటుంది..
ఫైనల్ కోసం తన జట్టు భారత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ నుంచి కొంత నేర్చుకుంటుందని స్టీడ్ చెప్పాడు. ఇక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసుకోవడం వల్ల భారత్ ప్రయోజనం పొందుతుందని వాస్తవాన్ని ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. భారత్ తన అన్ని మ్యాచ్ లను ఇక్కడ దుబాయ్ లో ఆడింది.. కానీ మాకు ఇక్కడ ఒక మ్యాచ్ ఆడే అవకాశం కూడా లభించింది.. ఆ అనుభవం నుంచి తాము నేర్చుకోవాలనుకుంటున్నామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ అన్నారు.

గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ.. తాను చెప్పదలచుకున్నది ఏమిటంటే.. ప్రారంభంలో టోర్నీలో ఎనిమిది జట్లు ఉండేవి.. ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దశకు చేరుకోవడం చాలా ఉత్సాహంగా ఉందన్నారు. ఇది కూడా ఇతర మ్యాచ్ ల మాదిరిగానే ఉంటుందని తాము నమ్ముతున్నామన్నారు. ఆదివారం బాగా ఆడి భారత్ ను ఓడించగలిగితే తాను సంతోషంగా ఉంటానని గ్యారీ స్టీడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
షెడ్యూల్ చాలా బిజీగా ఉందని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ అంగీకరించాడు. కానీ తమ జట్టు అలాంటి పరిస్థితులకు అనుగుణంగా మారగలదన్నారు. "లాహోర్ లో ఆడిన తర్వాత ఇక్కడికి వస్తున్నామని అనడంలో ఎటువంటి సందేహం లేదు.. నిన్నటి రోజంతా ప్రయాణంలో గడిపాం. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మ్యాచ్ కు సిద్ధం కావడానికి తగినంత సమయం ఉంది. ఇప్పుడు టోర్నమెంట్ చివరి దశలో ఉన్నాం. కొన్ని సార్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు." అని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ స్పష్టం చేశారు.