గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అలజడులు తీవ్ర స్థాయికి పెరిగాయి. రెండు రోజుల వ్యవధిలోనే కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు వరుసగా రాజీనామాలు చేసి సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పాక్ బోర్డు చైర్మన్ జకా అష్రఫ్ కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతకుముందు పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ తమ పదవులకు రాజీనామా చేసి షాకిచ్చారు.
అయితే జకా అష్రఫ్పై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ తీవ్ర విమర్శలు చేశాడు. భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు అష్రఫ్ కారణమని ఆరోపించాడు. జట్టులో అతడు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాడని మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ మండిపడ్డాడు.

''కీలకమైన ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ జట్టును ఎంపిక చేసింది పాక్ బోర్డు కాదని, కెప్టెన్, చీఫ్ సెలక్టర్ మాత్రమే సెలక్ట్ చేశారని జకా అష్రఫ్ ప్రకటించాడు. ఇది ఆటగాళ్లలో ప్రతికూల ఆలోచన తీసుకువస్తుంది. ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది'' అని ఇంజమామ్ అన్నాడు. ప్రపంచకప్కు పాక్ జట్టును చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే ఇంజమామ్ తన సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. పరస్పర విరుద్ద ప్రయోజనాల ఆరోపణలు రావడంతో తప్పుకున్నాడు. ప్లేయర్స్ మేనేజ్మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్కు వాటా ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ కోసం పాక్ బోర్డు ఓ కమిటీ కూడా వేసింది. కాగా, ఆ కమిటీ నివేదిక కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని ఇంజమామ్ పేర్కొన్నాడు.
మరోవైపు జకా అష్రఫ్పై బోర్డు సభ్యులు సానుకూలంగా లేరు. అష్రఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడనే విమర్శలు చేస్తున్నారు. వన్ మ్యాన్ షోలా అతడు ప్రవర్తిస్తాడని, సమగ్ర నిర్ణయాలు తీసుకోవడంలో అష్రఫ్ విఫలమవుతాడని సీనియన్ పాక్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే వన్డే ప్రపంచకప్ పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కూడా పెనుమార్పులు జరిగిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ తప్పుకుంటున్నట్టు బాబార్ అజామ్ ప్రకటించాడు.
అయితే ప్రపంచకప్లు ముగిసిన అనంతరం తమ కెప్టెన్ల మార్చడం పాకిస్థాన్కు కొత్తేమి కాదు. ప్రక్షాళన పేరుతో గతంలో ఎన్నో సార్లు ఇలా చేసింది. కానీ ఈ సారి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కొత్త కెప్టెన్లను నియమిస్తున్నట్లు పాకిస్థాన్ బోర్డు ప్రకటించింది. టెస్టు బాధ్యతలు షాన్ మసూద్కు అప్పగించింది. కొత్త ఉత్సాహంతో మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టుకు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయింది. మరోవైపు షాహిన్ అఫ్రిది కెప్టెన్సీలో టీ20 జట్టు ప్రదర్శన కూడా తీసికట్టుగా ఉంది. న్యూజిలాండ్తో జరగుతున్న అయిదు టీ20ల సిరీస్ను 1-4తో కోల్పోయింది.