టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో ఒత్తిడిని జయిస్తూ గిల్ అదరగొట్టాడని అశ్విన్ పేర్కొన్నాడు. భవిష్యత్లో భారత క్రికెట్ సూపర్ స్టార్ గిల్ అవుతాడని తెలిపాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్ ఆరంభంలో ఫీల్డింగ్లో గిల్ ఇబ్బంది పడ్డాడని అన్నాడు. విరాట్ కోహ్లి స్థానంలో ఫీల్డింగ్ చేయడం అంత సులువు కాదని అశ్విన్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్లో గిల్ తొమ్మిది ఇన్నింగ్స్లో 56 సగటుతో 452 పరుగులు చేశాడు. సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. రెండు సెంచరీలు సాధించాడు. మరో మ్యాచ్లో 91 పరుగులతో తృటిలో సెంచరీ కోల్పోయాడు. రెండు అర్ధశతకాలు బాదాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్ ఆరంభంలో గిల్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు నుంచి తప్పించాలని డిమాండ్స్ వచ్చాయి. దీనిపై అశ్విన్ మాట్లాడాడు.

''విరాట్ కోహ్లి షార్ట్ మిడ్ వికెట్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఆ స్థానాన్ని గిల్తో భర్తీ చేయడం చాలా కష్టతరం. విరాట్ కోహ్లి, సురేశ్ రైనా ఆ స్థానంలో సత్తాచాటారు. అయితే తొలి టెస్టులో గిల్ ఆ ప్లేస్లో ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులోపు ఆ స్థానంలో గిల్ అలవాటు పడ్డాడు. బెన్ డకెట్ క్యాచ్ను అందుకున్నాడు. రోజు రోజుకు గిల్ ఆట మెరుగవుతుందని, తానెంతో శ్రమిస్తున్నాడని చెప్పడానికి ఇదో ఉదాహరణ''

''శుభ్మన్ గిల్ను మరో విషయంలో ప్రశంసిస్తున్నా. అతని ఆటలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. తుదిజట్టులో అతని స్థానంపై ప్రజలు చర్చించారు. అతని ఆటలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ అధిరోహించి సత్తాచాటాడు. కాల్చి వడపోసిన బంగారంలా తయారయ్యాడు. అంతేగాక భారత క్రికెట్లో మరో సూపర్ స్టార్ అయ్యే శుభ్మన్ గిల్కు ప్రజల దృష్ట్యా ఈ ప్రయాణం ఎంతో కీలకం. అతడు ఒత్తిడిని జయించాడు. ప్రశంసలు దక్కించుకున్నాడు'' అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్లో గిల్ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.