టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. మ్యాచ్లను తనదైన శైలిలో విశ్లేషిస్తుంటాడు. అతడి వన్డే కెరీర్ ముగిసిపోయిందని భావించిన తరుణంలో తిరిగి వన్డే వరల్డ్ కప్నకు ఎంపికై అందర్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో మాత్రమే అతడికి అవకాశం దక్కింది. పది ఓవర్లు వేసిన అతడు 34 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో అశ్విన్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. వికెట్ కీపర్ కేఎస్ భరత్తో కలిసి వీడియోకు స్వాగతం చెప్పిన అశ్విన్ తర్వాత టీమిండియా లోకల్ మేనేజర్ వెంకటేశ్తో మాట్లాడాడు. అతడిని ఆటపట్టిస్తూ ముచ్చటించాడు.

'సర్ మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలి. ఆర్ వెంకటేశ్ లేదా పప్పా?' అని వెంకటేశ్ను అశ్విన్ అడగ్గా... దానికి ఆయన బదులిస్తూ 'పప్పా వెంకటేశ్ అని పిలిస్తే చాలు' అన్నాడు.'మీకు పరిచయం చేసిన ఈ వ్యక్తి భారత క్రికెట్జట్టుకు అతిపెద్ద విలన్.వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాకు గత నెల వరకు లోకల్ మేనేజర్గా ఉన్నాడు. మీరు ఎందుకు ఇలా చేశారు సర్? ఇప్పుడు ఎలా ఉన్నారు?' అని అశ్విన్ సరదాగా వెంకటేశ్ను ప్రశ్నించాడు.
ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలై ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆ జట్టుకు సేవలందించిన వెంకటేశ్ అని వ్యంగ్యంగా అశ్విన్ అన్నాడు. దానికి వెంకటేశ్ బదులిస్తూ 'గత నెల వరకు నా జీవితం సాఫీగా ఉండేది. ఆ తర్వాత నుంచి ఆ ప్రశాంతతను కోల్పోయా' అని చెప్పాడు. భారత్కు కప్ అందుకోలేకపోయినందుకు బాధ పడుతున్నానని ఇండైరెక్ట్గా వెంకటేశ్ వివరించాడు.
ప్రస్తుతం అశ్విన్ దక్షిణాఫ్రికాలో ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్టౌన్లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.