
కమ్మిన్స్ ప్రభావం చూపలేకపోవడానికి
కోల్కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ పాట్ కమ్మిన్స్ను 15.5 కోట్ల రూపాయలను పెట్టి కొనుగోలు చేసింది. అయినప్పటికీ.. ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు ఓవర్లు మాత్రమే వేసిన పాట్.. ఏకంగా 49 పరుగులను సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతని ఖాతాలో పడలేదు. అతని బౌలింగ్ ఆద్యంతమూ నాసిరకంగా కనిపించింది. లైన్ అండ్ లెంగ్త్ తప్పిపోయాడు. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. తప్పుల మీద తప్పులు చేశాడు. ఓ సాధారణ బౌలర్లా మారిపోయాడు. బంతి ఎక్కడ? ఎలా వేయాలనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా సాగింది అతని బౌలింగ్.

క్వారంటైన్ నుంచి నేరుగా..
పాట్ కమ్మిన్స్ నాసిరకం ప్రదర్శనకు కారణాలు లేకపోలేదు. క్వారంటైన్ నుంచి నేరుగా మ్యాచ్ ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన నిబంధనలో భాగంగా.. ప్రతి క్రికెటర్ కూడా క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దాన్ని పూర్తి చేసుకున్న పాట్.. చివరి నిమిషంలో టీమ్లో చేరాడు. తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్ సాయంత్రం 7:30కు ఆరంభం కావాల్సి ఉండగా.. 3:30 గంటలకు అతణ్ని ఆడటానికి అవకాశం లభించింది. దీనితో పెద్దగా ప్రాక్టీస్ అనేది లేకుండా నేరుగా మ్యాచ్లో దిగాడు. ప్రభావాన్ని చూపలేకపోయాడు.

వరల్డ్ క్లాస్ బౌలర్.. తప్పు పట్టలేం..
పాట్ కమ్మిన్స్ వైఫల్యాన్ని కోల్కత నైట్ రైడర్స్ స్కిప్పర్ దినేష్ కార్తీక్ ఏ మాత్రం తప్పు పట్టట్లేదు. అది అతని వైఫల్యంగా తాను భావించట్లేదని చెప్పాడు. కమ్మిన్స్ వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో సందేహాలు అక్కర్లేదని, అతని స్థాయికి తగినట్టుగా ఆడతాడనీ అన్నాడు. క్వారంటైన్ నుంచి నేరుగా మ్యాచ్ ఆడటానికి వచ్చిన ప్రభావం అతనిపై పడందని చెప్పాడు. ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్లోకి దిగాడని పేర్కొన్నాడు. తమ ఓటమికి పాట్ కమ్మిన్స్ను బాధ్యుడిని చేయడం మంచిది కాదని అన్నాడు. అతనిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని దినేష్ కార్తీక్ స్పష్టం చేశాడు.

భారీ స్కోరును అందుకోలేక..
అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-2020 అయిదో మ్యాచ్లో కోల్కత ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడింది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా తమ స్థాయిలో ఆడలేకపోయారు. ఇవాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, శుభ్మన్ గిల్.. ఇలా ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో కేకేఆర్ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.


Click it and Unblock the Notifications












