ధోనీ ఐస్ మ్యాన్:
'2018 ఫైనల్లో చేసిన సెంచరీ ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆ సమయంలో ఫ్లెమింగ్తో కలిసి పనిచేయడం. నేను కలిసి పనిచేసిన కోచ్లలో అతడు అత్యుత్తమం. ఆటను అతడు బాగా అర్థం చేసుకుంటాడు. అతడి ఆలోచనలు గొప్పగా ఉంటాయి. ఇక ధోనీతో కలిసి ఆడటం అద్భుతంగా ఉంటుంది. అదో గొప్ప అనుభూతి. అతడు మైదానంలో 'ఐస్ మ్యాన్'లా ఉంటాడు. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటం నా అదృష్టం' అని వాట్సన్ తెలిపాడు.
ధోనీ లాంటి సారథే లేడు:
'అసలు ధోనీ లాంటి సారథే లేడని, నిజమైన నాయకత్వం అతనిదేనని వాట్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'చెన్నైకి ఆడుతున్నప్పుడు వరుసగా పది మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేయకపోయినా తుది జట్టులో స్థానం ఉంటుంది. అదే మరో ఫ్రాంచైజీ అయితే రిజర్వ్ బెంచ్కు పరిమితం కావలసిందే. కానీ చెన్నై జట్టు అలా కాదు. అందుకు ముఖ్యంగా కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్లకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సీజన్ మొత్తంలో నేను బాగానే బ్యాటింగ్ చేశా. కానీ మంచి స్కోర్లు మాత్రం చేయలేకపోయా. నన్ను బెంచ్కే పరిమితం చేస్తారనుకున్నా.. కానీ వాళ్లు అలా చేయలేదు. అయితే ఫైనల్ మ్యాచ్లో వారి నమ్మకాన్ని నేను నిలబెట్టగలిగాను. నేను కచ్చితంగా చెప్పగలను నిజమైన నాయకత్వం అంటే ధోనీదే' అని వాట్సన్ పేర్కొన్నాడు.
రక్తంతో ప్యాంట్ తడిసినా పట్టించుకోలేదు:
2018 సీజన్తో చెన్నై తరఫున బరిలోకి దిగుతున్న వాట్సన్.. ఆ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 150 స్ట్రైక్రేట్తో 555 పరుగులు చేశాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో అద్భుత సెంచరీతో చెన్నైని చాంపియన్గా నిలిపాడు. ఇక గత సీజన్లో లీగ్ దశలో మాములుగానే ఆడిన వాట్సన్.. ముంబైతో జరిగిన ఫైనల్లో మాత్రం అద్భుతంగా పోరాడాడు. 59 బంతుల్లో 89 పరుగులతో జట్టును మరోసారి గెలుపు దిశగా తీసుకెళ్లాడు. రక్తంతో ప్యాంట్ తడిసినా పట్టించుకోలేదు. అయితే ఆఖర్లో అనూహ్యంగా రనౌటై క్రీజును వీడటంతో ధోనీ సేన ఒక్క పరుగుతో టైటిల్ను చేజార్చుకుంది.
సీఎస్కే ఎక్కువగా మార్పులు చేయదు:
భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చెన్నై జట్టును కొనియాడాడు. ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయకపోయినా విశ్వాసం ఉంచి జట్టులో కొనసాగిస్తారని అన్నాడు. 'సీఎస్కే జట్టులో ఎక్కువగా మార్పులు చేయదు. 2018 సీజన్లో వాట్సన్లో గొప్ప ప్రదర్శనలేమి చేయలేదు. కానీ ఫైనల్లో సెంచరీ సాధించాడు. రాణించకపోయినా అతడికి జట్టు అండగా నిలవడంతోనే తుది పోరులో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్తో జరిగిన ఫైనల్లోనూ వాట్సన్ విజయం కోసం గొప్పగా పోరాడాడు' అని భజ్జీ పేర్కొన్నాడు.