హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంత ప్రజలు క్రికెట్ అసోసియేషన్ గురించి ఇప్పటికే పలు వాదనలు వినిపించారు. ఈ మేరకు బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)లో సహచర సభ్యత్వం కావాలంటూ కోరింది. ఇటీవలే భారత క్రికెట్ నిర్వహణలో వివిధ మార్పులను సూచిస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులు జారీ చేసింది. ఆ మార్పులను తమ సంఘంలోనూ అమలు చేస్తామంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్ణయాన్ని తెలియజేసింది.
మార్పులను తమ నియమావళిలో చేరుస్తూ ఆమోదముద్ర వేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో లోధా సిఫారసుల్లో విడిగా కొన్ని అంశాల అమలుకు హెచ్సీఏ సిద్ధమైనా... అన్నింటికీ ఏకాభిప్రాయం కుదర్లేదు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసేందుకు హెచ్సీఏ సిద్ధమైంది. అందు కోసం అసోసియేషన్ బైలాస్ (నియమావళిలో) కూడా లోధా సిఫారసులను చేర్చారు.
కావాలంటే మళ్లీ మార్పులు చేస్తాం:
రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు లోధా సిఫారసులకు సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది. మరి కొద్ది రోజుల్లో ప్రకటించనున్న తీర్పులో సుప్రీం కోర్టు ఏమైనా మార్పులను ఆదేశిస్తే దాని ప్రకారం మరోసారి నియమావళిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎస్జీఎంలో హెచ్సీఏ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు హెచ్సీఏ నియమావళి ప్రకారం తెలంగాణ ప్రాంత పరిధిలోని 10 జిల్లాల్లో క్రికెట్ కార్యకలాపాలను హెచ్సీఏ పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు దీనిని 'తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలు'గా సవరించారు. సర్వసభ్య సమావేశంలో కొందరు సభ్యుల నుంచి వివిధ అంశాలపై కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా... మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగానే ముగిసింది. హైకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సీతాపతి, జస్టిస్ అనిల్ దవే సమక్షంలో ఈ ఎస్జీఎం జరిగింది. దీనిని పర్యవేక్షిందుకు బీసీసీఐ తరఫున రత్నాకర్ శెట్టి హాజరయ్యారు.