
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ద్వారా విశాఖ ఇండస్ట్రీస్కు రూ.12 కోట్లు డబ్బు అక్రమంగా చేరిందని చేస్తున్న ఆరోపణలను వి.హనుమంతరావు నిరూపించగలరా? అని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ ప్రశ్నించాడు. శనివారం సోమాజిగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హైకోర్టు ఆదేశాలతో జరిగిన హెచ్సీఏ వార్షిక సమావేశం సందర్భంగా వీహెచ్ తప్పుడు ఆరోపణలు చేసారని విమర్శించారు.
'నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఆ సొమ్ము తీసుకున్నట్లు వీహెచ్ నిరూపిస్తే ఆయనకు రూ.24కోట్లు ఇస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 8న హెచ్సీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. అక్కడ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారు. వీహెచ్ మానసికస్థితి సరిగా లేక ఇలా మాట్లాడుతూ ఉండుడొచ్చు. 2004లో స్టేడియం కట్టే సమయంలో విశాక ఇండస్ట్రీస్ నుంచి రూ. 4.32 కోట్లు స్పాన్సర్షిప్ చేశాం.'
'నా గురించి తప్పుగా మాట్లాడుతున్న అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2011లో అర్షద్ ఆయూబ్ మా అగ్రిమెంట్ను అక్రమంగా రద్దు చేశారు. దీనిపై మేము ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేస్తే... హెచ్సీఏ రూ. 25.92 కోట్లు విశాకకు పెనాల్టీగా ఇవ్వాలని ఆర్బిట్రేషన్ తీర్పునిచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎస్జీఎంలో విశాకతో వివాదాన్ని కోర్టు బయట తేల్చుకోవాలని నిర్ణయించుకున్న హెచ్సీఏ... అందుకు అనుగుణంగా వ్యవహరించింది. ' అని పేర్కొన్నాడు.
'అప్పటి హెచ్సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట విశాకతో తమ వివాదం ముగిసిందంటూ మెమో సమర్పించాడు. ఇందుకు ప్రతిఫలంగా విశాకకు రూ. 17.50 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా హెచ్సీఏ నుంచి విశాకకు అందలేదు. మ్యాచ్ఫిక్సింగ్ ఆరోపణల్ని అజారుద్దీన్ ఒప్పుకున్నాడు. కార్యదర్శి శేషునారాయణ, అర్షద్ అయూబ్, జాన్ మనోజ్పై కూడా పలు ఆరోపణలతో కేసులు ఉన్నాయి' అని ఆయన వివరించారు.