అన్ని ప్యానెల్స్ అజహరుద్దీన్ వైపే
హెచ్సీఏ అధ్యక్షుడిగా అన్ని ప్యానెల్స్ అజహరుద్దీన్ వైపే మొగ్గు చూపాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం మూడు ప్యానెల్స్ ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం అజహరుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానళ్ల మధ్యే కొనసాగింది. హెచ్సీఏ అధ్యక్షుడి మినహా మిగతా ఐదుస్థానాలకు ఈ రెండు ప్యానెళ్ల మధ్య గట్టి పోటీ ఎదురైంది.
హెచ్సీఏ ఎన్నికల్లో
హెచ్సీఏ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కుని వినియోగించుకున్న సభ్యులు
155 ప్రైవేట్ క్లబ్లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ నామినేషన్ తిరస్కరణ కావడంతో అతడు అజారుద్దీన్కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్కు మద్దతు ఇచ్చారు.
అజహరుద్దీన్ ఘన విజయం
అయినప్పటికీ అజహరుద్దీన్ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడి కావాలన్న తన కల ఫలించినట్లయ్యింది. 2017లో ఇదే పదవికి అజార్ నామినేషన్ వేసినప్పటికీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఉండడంతో హెచ్సీఏ అధికారులు అజార్ నామినేషన్ను తిరస్కరించారు. బీసీసీఐ అతడికి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ ఆ పత్రాలు సమర్పించలేదన్న కారణంతో నామినేషన్ను తిరస్కరించినట్టు హెచ్సీఏ అప్పట్లో పేర్కొంది. అయితే హెచ్సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్ విజయం సాధించారు.