
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభమయిన కొద్దిసేపటికే టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో లక్ష్మణ్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వివేక్, చాముండి, హనుమంతరావులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలుబడబున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 226 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 155 ప్రైవేట్ క్లబ్లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
హెచ్సీఏ అధ్యక్షపదవిపై త్రిముఖ పోటీ నెలకొంది. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, దిలీప్ కుమార్, ప్రకాష్చంద్ జైన్లు ప్రధానంగా పోటీపడుతుతున్నారు. ఈసారి ఎలాగైనా హెచ్సీఏ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అజర్ పట్టుదలతో ఉన్నాడు. దీంతో అందరి చూపు అజారుద్దీన్పైనే ఉంది. అయితే అజారుద్దీన్ తన గెలుపుపై ధీమాగా ఉన్నాడు.
మరోవైపు నామినేషన్ తిరస్కరణ కావడంతో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్.. అజారుద్దీన్కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్కు మద్దతు ఇస్తున్నారు. ఇక టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్ ప్యానెల్ అవినీతి నిర్మూలనే ప్రధాన ఏజెండాగా బరిలోకి దిగుతున్నది. దీంతో ఈ సారి అధ్యక్షుడు ఎవరనే దానిపై అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్ష పదవి కోసం జాన్ మనోజ్, సర్దార్ దల్దీత్ సింగ్లు రేసులో ఉన్నారు.