ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందే. సన్రైజర్స్ తొలి రెండు మ్యాచులు (మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో, మార్చి 27న లఖ్ నవూ సూపర్ జెయింట్స్తో) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టికెట్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం డిస్ట్రిక్ జొమాటో యాప్లో అందుబాటులో ఉంచింది.
కానీ తక్కువ ధర ఉన్న టికెట్లు కాసేపట్లోనే అయిపోయినట్లు చూపించడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వాహకులు టికెట్లను బ్లాక్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల అమ్మకాలపై వస్తోన్న ఆరోపణలను ఖండించారు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు.

"హైదరాబాద్ మ్యాచ్ టిక్కెట్లను విక్రయించేది బుక్మై షోలో కాదు. డిస్ట్రిక్ జొమాటో యాప్లో టికెట్లను విక్రయించేది. తొలి రెండు మ్యాచ్ల టిక్కెట్లు ఇప్పటికీ డిస్ట్రిక్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. మిడిమిడి జ్ఞానం, సమాచారంతో వార్తలు ప్రసారం చేసి అభిమానులను గందరగోళంకు గురి చేయొద్దు. ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లపై నియంత్రణ సన్రైజర్స్ హైదరాబాద్ది. హెచ్సీఏది కాదు. బీసీసీఐ, హెచ్సీఏ ఐపీఎల్ ఏర్పాట్లను మాత్రమే పరిశీలిస్తుంది. కానీ టిక్కెట్లను విక్రయించదు. ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రతిష్ఠను మసకబారిస్తే ఉపేక్షించేది లేదు. దేశంలోనే హెచ్సీఏను ఒక రోల్ మోడల్గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం." అని అర్శనపల్లి జగన్మోహన్ రావు అన్నారు.
టీటీడీ విషయంలో ఇలానే నిర్వహిస్తారా?
"ఐపీఎల్ టిక్కెట్ల దందా అని హెచ్సీఏపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానెళ్లకు లీగల్ నోటీసులిస్తాం. కొందరిచ్చే తప్పుడు సమాచారంతో హెచ్సీఏపై బురదజల్లితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. టీటీడీ విడుదల చేసే రూ.300ల టిక్కెట్లు వెంటనే అయిపోతే ఇలానే వ్యవహరిస్తారా?. అయినా తక్కువ ధర టిక్కెట్లకు విద్యార్థులు, యువతలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే అవి త్వరగా విక్రయమవుతాయి. చివరగా టిక్కెట్ల విషయమై ఏమైనా అనుమానులుంటే సన్ రైజర్స్ యాజమాన్యం, సిబ్బంది, డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ ప్రతినిధులను సంప్రదించండి." అని అర్శనపల్లి జగన్మోహన్ రావు పేర్కొన్నారు.