Sunrisers Hyderabad VS HCA: మార్చి 30 తెలుగు క్రికెట్ అభిమానులంతా నిద్ర లేచేసరికి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ రాసిన ఓ లేఖ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఉచిత టికెట్ల విషయంలో తమను హెచ్సీఏ దారుణంగా వేధిస్తోందని, బెదిరిస్తోందని, ఇది ఇలానే కొనసాగితే.. హైదరాబాద్ నగరాన్నే తాము విడిచి వెళ్లిపోతామని దాని సారాంశం. హెచ్సీఏ అధ్యక్షుడు కూడా తమను పలుమార్లు బెదిరించారని అందులో రాసి ఉంది.
అయితే ఈ లేఖ బయట వచ్చి చర్చనీయాంశమైన కాసేపట్లోనే హెచ్సీఏ ఓ అధికార ప్రకటన విడుదల చేసింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది హెచ్సీఏ అధ్యక్ష కార్యాలయం ఓ నోట్ విడుదల చేసింది.

సన్రైజర్స్ విడుదల చేసిన లేఖ అంటూ ప్రచారం అవుతున్న దాంటో ఏముందంటే?
"మేం గత 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పని చేస్తున్నాం. కానీ గత రెండేళ్లుగా హెచ్సీఏ నుంచి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఏళ్లుగా మాకున్న ఒప్పందం ప్రకారమే హెచ్సీఏకు 3900 కాంప్లిమెంటరీ టికెట్లు, అందులోనే 50 కాంప్లిమెంటరీ టికెట్లు (ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్) టికెట్లు కేటాయిస్తున్నాం. కానీ ఈ ఏడాది ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే ఉన్నాయి, అదనంగా మరో బాక్స్లోనూ 20 టికెట్లు కేటాయించాలని అడిగింది. దీనిపై చర్చించి, సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోకే వస్తుంది. దానికి అద్దె కూడా చెల్లిస్తున్నాం. కానీ గత మ్యాచులో ఎఫ్-3 బాక్సుకు లాక్ (తాళాలు) వేశారు. ఎక్స్ట్రాగా మరో 20 ఫ్రీ టికెట్లు కావాలని, లేదంటే బాక్స్ తెరవమంటూ చివరి నిమిషంలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది సరైన చర్య కాదు. ఇలా చేస్తే సమన్వయంతో పని చేయడం ఇబ్బందిగా మారుతుంది. అయినా వాళ్లు ఇలా బెదిరింపులకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గత రెండే సీజన్లలో హెచ్సీఏ, మా సిబ్బందిని ఎన్నో సార్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మేం దీన్ని హెచ్సీఏ దృష్టికి కూడా తీసుకెళ్లాం.
అధ్యక్షుడు కూడా బెదిరింపులు...
ఈ ఏడాది హెచ్సీఏ అధ్యక్షుడు కూడా పలుసార్లు బెదిరించారు. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఈ స్టేడియంలో సన్రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. మరో వేదికను చూసుకుంటాం. ఈ సమస్యను పరిష్కారించాలని కోరుకుంటున్నాం." అని సన్రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేఖలో రాసుకొచ్చారు.