Hayley Matthews: మ్యాచు మధ్యలో.. మైదానంలో దెబ్బ తాకినా, గాయం బలంగా తగిలినా.. పట్టుదలతో జట్టు కోసం పోరాడే ఆటగాళ్లను చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా మరో మహిళా క్రికెటర్ ఇదే చేసింది. తన పోరాట స్ఫూర్తితో ప్రపంచ క్రికెట్ మనసును గెలిచింది. మ్యాచు మధ్యలో నడవలేని స్థితిలో స్ట్రెచర్పై వెళ్లిన ఆమె.. అదే మ్యాచు కోసం మళ్లీ తిరిగొచ్చి సెంచరీ బాది ఔరా అనిపించింది. ఇంతకీ ఆమె ఎవరంటే?
నడవలేని స్థితిలో పోరాడి..
క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్న ఆమె పేరు హేలీ మాథ్యూస్. వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్. నాయకుడు లేదా నాయకురాలు.. జట్టు కోసం ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా నిలబడి పోరాడలన్న స్ఫూర్తికి నిదర్శనగా నిలిచిందామె.

అసలేం జరిగిందంటే?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భాగంగా స్కాట్లాండ్ - వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 245 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగింది వెస్టిండీస్. అయితే హేలీ (114 నాటౌట్; 113 బంతుల్లో 14×4), జైడా జేమ్స్ (45) అద్భుతంగా రాణించడంతో విండీస్ లక్ష్యం దిశగా సాగింది.
నిరాశ తప్పలే..
అయితే ఇక్కడ ఓ వైపు తమ జట్టు వికెట్లు కోల్పోతున్నా మరోఎండ్లో ఉన్న హేలీ పోరాటం ప్రశంసనీయం. ఈ క్రమంలోనే 95 పరుగుల దగ్గర ఆమె ఉండగా.. దురదృష్టవశాత్తు అనుకోకుండా తన కాళ్లు పట్టేయడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే ప్రాథమిక చికిత్స తీసుకొని తిరిగొచ్చిన ఆమె.. 99 వరకు చేరుకుంది. కానీ మళ్లీ బ్యాటింగ్ చేయలేకపోయింది. ఆ సమయంలో ఆమెను స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. అయితే తమ జట్టులో 9వ వికెట్ పడిపోవడం వల్ల.. హేలీలో మరింత కసి పెరిగిపోయింది. ఇబ్బంది పడుతూనే మళ్లీ రెండోసారి బ్యాటింగ్ కు వచ్చింది హెలీ. సెంచరీ పూర్తి చేయడంతో పాటు ఆలియా అలీన్ (17)తో కలిసి 30 పరుగులు భాగస్వామ్యం జోడించింది. కానీ ఆమె పోరాటనికి ఫలితం దక్కలేదు. జట్టు విజయానికి చేరుకోలేకపోయింది. విండీస్ ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో హేలీకి తీవ్ర నిరాశ తప్పలేదు.