
ఆంటిగ్వా: తక్కువ స్కోర్ చేయడంతో ఈ రోజు చాలా నిరాశ చెందా. నా బ్యాటింగ్ టెక్నిక్ అంతా బాగానే ఉంది, కాకపోతే మరింత ఓపిక చూపించాలి అని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. రాహుల్ ఈ మధ్య కాలంలో మోస్తరుగా రాణిస్తూ టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. అయితే రాహుల్ విఫలమవుతున్నా.. అతడిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న జట్టు యాజమాన్యం కుదిరినన్ని అవకాశాలు ఇస్తోంది. ఇక రాహుల్ బ్యాటింగ్ టెక్నిక్ బాలేదని చాలా కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇష్టమైన ఫెయిల్యూర్ ఆటగాడిగా జట్టులో కొనసాగిస్తున్నారని చాలా మంది అభిమానులు బాహాటంగానే అంటున్నారు. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్తో పాటు టెక్నిక్కు సంబంధించి రాహుల్ స్పందించాడు. 'తక్కువ స్కోర్ చేయడంతో ఈ రోజు చాలా నిరాశ చెందా. నా బ్యాటింగ్ టెక్నిక్ బాగానే ఉంది. కాకపోతే మరింత ఓపిక చూపించాలి. 35-45 పరుగుల మధ్యలో ఔట్ అవుతున్నా. 60 నుంచి 80 బంతులు ఎదుర్కొన్న క్రమంలో బాగానే ఆడుతున్నా. 200-250 బంతుల వరకూ నా బ్యాటింగ్ కొనసాగితే.. జట్టుకు లాభం చేకూరుతుంది. నేను చాలా విషయాలలో సంతోషంగా ఉన్నా' అని మూడో రోజు మ్యాచ్ అనంతరం రాహుల్ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్తో తొలి టెస్టు మ్యాచ్లో రాహుల్ కీలక సమయాల్లో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 44 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ తన ఇన్నింగ్స్లలో చాలా మంచి ఆరంభాలు ఇచ్చాడు. కానీ వాటిని చెప్పుకోదగిన ప్రదర్శనగా మార్చడంలో విఫలమయ్యాడు. రాహుల్ ఇప్పటివరకు 56 ఇన్నింగ్స్లలో 1905 పరుగులు చేసాడు. ఇందులో 5 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (51 బ్యాటింగ్), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (53 బ్యాటింగ్)లు రాణించడంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ, రహానే హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలవడంతో.. భారత్ 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.