ఇంగ్లండ్ బలమైన జట్టు
తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'పాకిస్తాన్ను నాకౌట్కు చేరకుండా చేయడానికి భారత్ ఓడిపోయింది అని అంటున్నారు. ఇంగ్లండ్ మీకంటే బలమైన జట్టు. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించేది. ఇంగ్లండ్ ఓడిపోయుంటే మీకు ఎదురైన పరిస్థితే ఉండేది. ఆ మ్యాచ్లో భారత్ గెలిచి బలమైన ఇంగ్లండ్ను బయటకు పంపించాలని ఎందుకు అనుకోదు. బయట ఉండి మ్యాచ్ చూస్తూ కావాలనే ఓడిపోయిందనే వాదన సరైనది కాదు. టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించాలనే అంటున్నారు. అసలు ఏమి జరిగిందని కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు' అని ప్రశ్నించాడు.
కాస్త ఆలోచించి సిగ్గు తెచ్చుకోండి
'నేను టీ షర్ట్ ధరించాను. దానిపై సిగ్గులేదని రాసుంది. కాస్త ఆలోచించి సిగ్గు తెచ్చుకోండి. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వకార్ యూనిస్ కూడా అలా మాట్లాడడం సమంజసం కాదు. నేను సీరియస్గానే అంటున్నా.. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ భాగస్వామ్యంలో అర్థం లేదని, ధోనీ ఆటతీరు ఆశ్చర్యపరిచిందని బెన్ స్టోక్స్ రాయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. స్టోక్స్ ఎక్కడ కూడా టీమిండియా ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందని చెప్పలేదు' అని ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు.
థియరీలు వెతకడం మానేస్తే మంచిది
'భారత్ కావాలనే ఓడిపోయిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బాహాటంగా అంటున్నారు. వారిపై ఐసీసీ జరిమానా విధించాలి. అసలు మీరలా ఎలా ఆలోచిస్తారు. ఆ పరిస్థితుల్లో కోహ్లీసేన పట్టికలో అగ్రస్థానంలో ఉండటం అవసరం. గ్రూప్ దశలో భారత్ ఒక్కటే మ్యాచ్ ఓడింది. అదీ ఇంగ్లండ్ చేతిలో మాత్రమే. భారత్పై ఇంగ్లండ్ ఎందుకు గెలవలేదని అంటే.. ఏ క్రికెట్ అభిమానిని అడిగినా చెబుతాడు. వివాదాస్పద థియరీలు వెతకడం మానేస్తే మంచిది' అని ఆకాశ్ చోప్రా సూచించాడు.
లీగ్ మ్యాచులో భారత్ ఓటమి:
గతేడాది ఇంగ్లండ్తో జరిగిన 2019 ప్రపంచకప్ లీగ్ మ్యాచులో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ 337 పరుగులు చేయగా.. కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పోరులో కోహ్లీ-రోహిత్ భాగస్వామ్యం, ఎంఎస్ ధోనీ సింగిల్స్కే పరిమితమైన తీరు ఆశ్చర్యపరిచిందని బెన్స్టోక్స్ తన పుస్తకం 'ఆన్ఫైర్'లో రాశాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సికిందర్ బక్త్, అబ్దుల్ రజాక్, రమీజ్ రాజా, ముస్తాక్ అహ్మద్లు కారాలుమిరియాలు నూరారు. భారత్ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందని విమర్శించారు. అందుకే ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు.