
అహ్మదాబాద్: సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్ను సరదాగా తీసుకుంటానని, వాటి గురించి పెద్దగా ఆలోచించనని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. నెటిజన్లు సరదా కోసం తనపై మీమ్స్, కెమెంట్స్ లాంటివి చేస్తారని, వాటిని ఆస్వాదించి ఊరుకుంటానని చెప్పాడు. టీమిండియా ఏదైనా సిరీస్ ఆడుతున్నప్పుడు, కోహ్లీసేన బాగా ఆడనప్పుడు, రవిశాస్త్రినే ఏదైనా ఫోటో షేర్ చేసినపుడు నెటిజన్లు కచ్చితంగా అతడిని టార్గెట్ చేస్తారు. అయితే తనపై వచ్చే మీమ్స్పై ఆదివారం రవిశాస్త్రి స్పందించాడు.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... 'సోషల్ మీడియాలో ఇదంతా సరదాగా జరిగే ప్రక్రియ. నెటిజన్లు నవ్వుకోవడానికే అవన్నీ (మీమ్స్, కెమెంట్స్) చేస్తారు. నాకు నష్టం కలిగేలా ఉన్నా ఫర్వాలేదు. నాకేమీ ఇబ్బందీ లేదు. నా పేరు చెప్పుకొని ఒక కూల్డ్రింక్ తాగండి. నా గురించి చేసే మీమ్స్తో ప్రజలు కాసేపు నవ్వుకుంటారు. వాటిని నేను ఎంతో ఆస్వాదిస్తారు. అవి నన్నేం బాధ పెట్టవు' అని తెలిపాడు. క్రికెట్లో బాగా ఆడుతూ విజయాలు సాధిస్తున్నంత కాలం ప్రజలు సంతోషంగా ఉంటారని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఒకవేళ ఓటములు లేదా వైఫల్యాలు ఎదురైతే అందుకు తగిన విమర్శలు, ప్రతిఫలాలు స్వీకరించాలన్నాడు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సందర్భంగా తనపై వచ్చిన ఓ సరదా మీమ్ను సైతం రవిశాస్త్రి ఆస్వాదించిన సంగతి తెలిసిందే. ఎవరో చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసిన శాస్త్రి.. ఆ జోక్ బాగుందని, తనకు నచ్చిందని పేర్కొన్నాడు. ప్రజల ముఖాల్లో కాస్త నవ్వు తెప్పించడం బాగుందన్నాడు. అయితే ఆ ఫొటోలో 'మ్యాచ్ అయ్యేంతవరకు తాగకుండా ఉండలేనని, రెండు రోజుల్లోనే ఆటను పూర్తి చేశారా?' అని అర్థం వచ్చేలా మీమ్ రూపొందించడం గమనాహర్హం. రవిశాస్త్రిని మద్యం విషయంలోనే ఎక్కువగా ఆటపట్టిస్తుంటారు అభిమానులు. అలాంటివి కూడా తనను బాధించవని ఆయన వివరించాడు.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ విజయం సాధించిన భారత్ ఇప్పుడు దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. శుక్రవారం నుంచి మొతేరాలోనే జరిగే ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో ఆటగాళ్లంతా అహ్మదాబాద్లోని హోటల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కడున్న కిడ్స్ ప్లే జోన్లో సరదాగా గడిపారు. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్ చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేశారు. ధావన్ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. మరోవైపు కోచ్ రవిశాస్త్రి సైతం ఆటగాళ్లతో సరదాగా గడిపాడు.