దుబాయి: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి చిరకాల ప్రత్యర్థిపై పాక్.. భారత్పై విజయం సాధించాలని ఆరాటపడింది. పాక్ క్రికెటర్లు వ్యక్తిగతంగా తామేం చేయాలనుకుంటున్నారో ముందే మీడియాకి అప్పజెప్పేశారు. లీగ్ దశలో ఓ మ్యాచ్, సూపర్ 4 దశలో ఓ మ్యాచ్ ఇలా రెండు సార్లు భారత్తో తలపడిన పాక్ చెప్పినవేమీ చేయలేక లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది.
తుది దశకు చేరిన ఆసియా కప్ టోర్నీలో భారత్, పాక్ల మధ్య రెండు మ్యాచ్లు జరగా.. రెండూ ఏకపక్షంగా ముగిశాయి. తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్కు అభిమానులు ఎంతగా నిరుత్సాహానికి లోనైయ్యారో.. టీమిండియా అభిమానులు అంతగా ఆనందపడుతున్నారు. మ్యాచ్ అయితే గెలిచాం. కానీ దాయాది జట్ల మధ్య పోరు మాత్రం.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు.. భారత జట్టుపై మెరుగ్గా రాణిస్తానని, పదికి పది వికెట్లు పడగొట్టాలని ఉందని హసన్ అలీ చెప్పుకొచ్చాడు. కానీ రెండు మ్యాచ్ల్లోనూ అతడికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ మాటకొస్తే పాక్ బౌలర్లు తీసింది రెండంటే రెండు వికెట్లు. అది కూడా మొదటి మ్యాచ్లోనే. దాయాది జట్ల మధ్య సమరానికి ముందు భారత బౌలింగ్ లైనప్ను కామెంట్ చేస్తూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు చేశాడు.
ఫకర్ జమాన్ భారత్ బౌలింగ్ను అవలీలగా ఎదుర్కుంటాడని, డబుల్ సెంచరీ చేస్తాడని జోస్యం చెప్పాడు. కానీ తొలి మ్యాచ్లో డకౌటయిన జమాన్, రెండో మ్యాచ్లో 31 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో పాక్ ఆటగాళ్లు, మాజీలను టార్గెట్ చేస్తూ భారత క్రికెట్ అభిమానులు ట్వీట్ల ద్వారా ఎగతాళి చేస్తున్నారు.