హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ గురువారం మరోసారి తన భర్తకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టింది. నాగ్పూర్కు చెందిన మంజు మిశ్రా అనే యువతితో షమీ చాటింగ్ చేసిన మెసేజ్ల స్క్రీన్ షాట్లను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
ఇప్పటికే షమీకి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని హాసిన్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లండన్కు చెందిన బిజినెస్మ్యాన్ మహ్మద్ భాయ్ అనే వ్యక్తి షమీకి అమ్మాయిలను పరిచయం చేసేవాడని, మంజు మిశ్రా అనే ఇంకో అమ్మాయితో షమీ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని పేర్కొంది.
దీంతో మంజుతో షమీ కలిసి దిగిన ఫోటోలతో పాటు ఆమెతో చేసిన ఛాటింగ్ ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేసింది. కాగా, తనను షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు వేధించారని కోల్కతా పోలీసులకు ఆమె లిఖిత ఫిర్యాదు చేయడంతో షమీపై కేసు నమోదైంది. అంతేకాదు బీసీసీఐ సైతం షమీని వార్షిక కాంట్రాక్టు నుంచి తప్పించింది.
షమీపై అతడి భార్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. ఈ ఆరోపణలపై అటు పోలీసులతో పాటు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కూడా విచారణ జరుపుతోంది. ఈ నివేదికపైనే షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భవిష్యత్ ఆధారపడి ఉంది.
మరోవైపు జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న షమీ మాత్రం తన ప్రాక్టీస్కు ఏమాత్రం విరామం ప్రకటించడం లేదు. ఇటీవల షమి బౌలింగ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. క్రికెటర్ షమీ తనకు తెలుసునని లండన్కు చెందిన మహ్మద్ బాయ్ అనే వ్యక్తి ఇటీవల స్పష్టం చేశాడు.
కాగా, నగదు బదిలీలు మాత్రం జరగలేదని చెప్పడం విశేషం. ఇక, తన షమీపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని జహాన్ ఆరోపించింది. 'సిగ్గుగా లేదు, నాపై ఆరోపణలు చేయడం ఆపేయ్. నీకోసం, కూతురి కోసమైనా ఆరోపణలపై వెనక్కి తగ్గి, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ' షమీ తనకు సూచించాడని జహాన్ పేర్కొంది.
షమీ నుంచి తనకు హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని షమీ భార్య కోరింది. తన పోరాటాన్ని మధ్యలో వదిలేసే ప్రసక్తేలేదని చెప్పుకొచ్చింది. 'మా పోరాటం ఓ స్థాయికి చేరింది. ఇప్పుడిక రాజీపడే ప్రశ్నేలేదు. నేను సొంతంగా పోరాడుతున్నా. ఒకవేళ నేను ఇప్పుడు వదిలేస్తే మొత్తం మహిళా సమాజానికే ఓటమిలా భావించాలి. నేను అలా ఎందుకు చేస్తాను? నా వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి' అని స్పష్టం చేసింది.
తన భర్తపై చేసిన ఆరోపణలకు గాను తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. అందుకే తన భర్తపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని హసీన్ జహాన్ స్పష్టం చేసింది.