
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మొదటి రెండు టెస్టులు ఓడిపోయినా తర్వాత నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు మాత్రం కుంగుబాటులో పడిపోయింది. సొంతగడ్డపై సైతం ఇండియాను గెలవకపోవడం పరాభవంగా మారింది. దీంతో ప్రపంచ కప్ కోసం ఈ జట్టు ఎంతవరకు సరిపోతుందా అనే విశ్లేషణలో పడింది ఆ జట్టు మేనేజ్మెంట్.
పరాజయంతో విశ్లేషణలో పడిన ఆ జట్టు ప్రధాన ఆటగాడైన హషీమ్ ఆమ్లా జట్టు గురించి ఇలా మాట్లాడాడు. సొంతగడ్డపై టీమిండియా చేతిలో సిరీస్ ఓటమి తమను నేలకు దించిందని దక్షిణాఫ్రి కా ఓపెనర్ హషీమ్ ఆమ్లా అన్నాడు. వరల్డ్కప్ ముందు ఇది తమకు కనువిప్పని చెప్పాడు. చివరి వన్డేలో పరువు కోసం పోరాడతామన్నాడు.
స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ ప్రదర్శనే రెండు జట్ల మధ్య ప్రధానంగా తేడా చూపిందని ఆమ్లా అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా వికెట్లపై స్పిన్నర్లు వికెట్లు తీయడం కష్టం.. కానీ వీరు మాత్రం అద్భుతం చేశారని ప్రశంసించాడు.తమ జట్టులో సైతం బౌలర్లు మంచి ప్రదర్శన చూపించారని కొనియాడాడు. రబాడ బౌలింగ్తో రోహిత్ శర్మను ఆరు సార్లు అవుట్ చేసిన సంగతి గుర్తు చేశాడు.
మార్కరమ్ కెప్టెన్సీ కొత్తైనా తాను చాలా నేర్పుగా ఆడి ఘనతను ప్రదర్శించాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడని మరోసారి నిరూపించుకున్నాడని ప్రశంసించాడు. సిరీస్లో భాగమైన ఆఖరు ఆరో వన్డేను విజయంతో ముగించాలని ఆశిస్తున్నామన్నాడు. పరువు కోసమైనా ఈ మ్యాచ్ను గెలిచి తీరాలని తెలిపాడు.