టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకులలోనే కాకుండా క్రికెటర్లోనూ ధోనికి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. ధోనిని ప్రేరణగా తీసుకోని క్రికెట్లోకి అడగుపెట్టిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ధోని కెప్టెన్సీలో ఆడాలని ఉవ్విల్లూరే ఆటగాళ్ల సంఖ్య భారీగా ఉంటుంది. అనామక ఆటగాళ్లు సైతం ధోని నాయకత్వంలో ఆడితే, అతను ఇచ్చే ప్రోత్సాహంతో రాటు దేలిన సంగతి తెలిసిందే. అందుకే అనేక మంది ఆటగాళ్లు ధోని కెప్టెన్సీలో ఆడాలని కలలు కంటుంటారు. తాజాగా ఈ జాబితాలో యువ పేసర్ హర్షల్ పటేల్ కూడా చేరిపోయాడు.
క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆరాధ్య దైవం అని హర్షల్ పటేల్ చెప్పాడు. ధోనిని ప్రేరణగా తీసుకునే తాను క్రికెట్లో అడుగుపెట్టినట్లు తెలిపాడు. అంతేకాకుండా మహేంద్ర సింగ్ ధోనిని అత్యుత్తమ కెప్టెన్గా హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన మనసులో ఉన్న కోరికను కూడా బయటపెట్టాడు. ఈ సారి తన పాత టీం అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కాకుండా మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
కాగా గత ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్షల్ పటేల్కు ఈ ఏడాది ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో 31 ఏళ్ల ఈ మీడియం పేసర్ ఈ సారి మెగా వేలంలో పాల్గొననున్నాడు.
ఐపీఎల్లో ఇప్పటివరకు 63 మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ 78 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/27. గతేడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన హర్షల్ పటేల్కు ఆ ఏడాది అత్యుత్తమ సీజన్గా చెప్పుకోవాలి. ఆ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ ఏకంగా 32 వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా 2012 నుంచి హర్షల్ పటేల్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఈ యువ పేసర్ పలు జట్లుకు ప్రాతినిధ్యం వహించాడు.
అయితే గతేడాది అదరగొట్టడంతో ఈ సీజన్లో హర్షల్ పటేల్ కోసం భారీగా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. అతని కోసం పలు జట్లు వేలంలో పోటా పోటీగా తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ప్రస్తుతం భారత జట్టులోనూ సభ్యుడిగా ఉండడం హర్షల్ పటేల్కు కలిసి రానుంది. గతేడాది కివీస్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా హర్షల్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.