ముంబై : అప్పట్లో సచిన్ ఇచ్చిన సలహా మేరకు.. 14ప్లేయర్స్-ఏ సైడ్ అనే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడంతో.. శివమ్ నాయక్ అనే ఆటగాడి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. టీమ్లో 11మంది మాత్రమే ఆడడం అవకాశం ఉండడంతో.. తుది జట్టులో శివమ్ కు ఎప్పుడూ చోటు దక్కలేదు.
సచిన్ ఇచ్చిన సూచనను తాజాగా ఆచరణలో పెట్టడంతో.. స్పిన్నర్ శివమ్ నాయక్ కు తుది జట్టులో చోటు దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించిన శివమ్ నాయక్ కేవలం 19పరుగులు మాత్రమే సమర్పించుకుని 7వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక్కసారిగా శివమ్ నాయక్ పేరు క్రికెట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా, 14ప్లేయర్స్-ఏ సైడ్ అనే ప్రతిపాదనను చాలా ఏళ్ల కిందటే సచిన్ ప్రతిపాదించారు. ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజీ మ్యాచుల్లో ఈ తరహా క్రికెట్ ఆడితే ఎక్కువ మంది ప్రతిభ గల ఆటగాళ్లు క్రికెట్ కు పరిచయమవుతారని అప్పట్లో సచిన్ పేర్కొన్నారు. ఇన్నాళ్లకు సచిన్ సూచనను పాటించిన ఎంసీఎ(ముంబై క్రికెట్ అసోసియేషన్) పెద్దలు.. హారీస్ షీల్డ్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ లో ఈ తరహా విధానాన్ని అమలు చేశారు.
ఫలితంగా స్పిన్నర్ శివమ్ నాయక్ జట్టులో చోటు దక్కించుకుని తన ప్రతిభ చాటుకున్నాడు. 14ప్లేయర్స్-ఏ సైడ్ విధానంలో భాగంగా జట్టులో 14మంది ప్లేయర్లకు అవకాశం దక్కుతుంది. మైదానంలో 11మంది ప్లేయర్సే ఉంటారు. బ్యాటింగ్ అయిపోయాక బౌలింగ్ చేసేప్పుడు, బ్యాట్స్ మెన్ రిలీవ్ అయితే బౌలర్ వచ్చి చేరుతాడు. దీంతో ఎక్కువమంది ప్లేయర్స్ కు ఫీల్ట్ లో సత్తా చాటే అవకాశం దక్కుతుంది.