
మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. యూపీ వారియర్జ్తో తాజాగా జరిగిన మ్యాచులో కూడా ముంబై బ్యాటర్లు చెలరేగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూపీ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అలీసా హేలీ (58) ఆ జట్టుకు అదిరిపోయే ఓపెనింగ్ అందించింది. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో తహ్లీయా మెక్గ్రాత్ (50) మినహా మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు.
కిరణ్ నవగిరే (17) తప్ప మిగిలిన బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ మూడు వికెట్లతో చెలరేగింది. అమీలియా కెర్ రెండు వికెట్లు తీసుకోగా.. హేలీ మాథ్యూస్ ఒక వికెట్ తీసుకుంది. దీంతో ముంబై వారియర్జ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు చెలరేగారు. హేలీ మాథ్యూస్ (12) ఈ మ్యాచ్లో రాణించలేదు. అయితే మరో ఓపెనర్ యాస్తికా భాటియా (42) ధనాధన్ ఆటతో ఆకట్టుకుంది.
మాథ్యూస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నాట్ సివర్ బ్రంట్ (45 నాటౌట్) అద్భుతంగా ఆడింది. అదే సమయంలో భాటియా అవుటవడంతో వచ్చిన ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఎడాపెడా బౌండరీలు బాదిన ఆమె వేగంగా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుంది. ఆ తర్వాత 18వ ఓవర్లో నాట్ సివర్ బ్రంట్ వరుసగా ఫోర్, సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్సెల్టోన్, రాజేశ్వరీ గైక్వాడ్ ఇద్దరూ చెరో వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. దీంతో ముంబై జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 164 పరుగులు చేసింది. జట్టుకు అద్భుతమైన విజయం అందించిన కెప్టెన్ హర్మన్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.