
టీమిండియా స్టార్ విమెన్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మరోసారి ఇంగ్లండ్లో చెలరేగేందుకు సిద్దమయింది. 2019 కియా మహిళల క్రికెట్ సూపర్ లీగ్లో లాంక్షైర్ థండర్ జట్టుకు ఆడేందుకు హర్మన్ప్రీత్ కౌర్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో లాంక్షైర్ థండర్కు ఈ సంవత్సరం సంతకం చేసిన మొదటి విదేశీ క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
'కియా సూపర్ లీగ్ కోసం మరోసారి లాంక్షైర్ థండర్కు సంతకం చేయడం చాలా ఆనందంగా ఉంది' అని క్లబ్ వెబ్సైట్ ద్వారా కౌర్ పేర్కొంది. 'లాంక్షైర్ జట్టులో నా మొదటి సీజన్ బాగా గడిచింది. నేను నిజంగా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరూ నన్ను స్వాగతించారు. నాకు డ్రెస్సింగ్ రూంలో గొప్ప స్నేహితులు ఉన్నారు. నేను మళ్ళీ వారితో ఆడటానికి ఎదురు చూస్తున్నా' అని హర్మన్ప్రీత్ తెలిపింది.
గత సంవత్సరం థండర్ అరంగేట్ర మ్యాచ్లోనే హర్మన్ప్రీత్ తన ప్రభావాన్ని చూపించింది. ఓవెల్ వేదికగా సర్రే స్టార్స్ జట్టుపై 34 పరుగులతో అజేయంగా నిలిచింది. చివరి బంతికి సిక్స్ బాది లాంక్షైర్ థండర్కు విజయాన్ని అందించింది. గత టోర్నమెంట్లో 32 సగటుతో 164 పరుగులు చేసింది. ఇక 151.85 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. లాంక్షైర్ జట్టులో ఇదే అత్యధికం.
హర్మన్ప్రీత్ కౌర్ 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ టీ20లో భారత్కు నాయకత్వం వహించింది. న్యూజిలాండ్పై కేవలం 51 బంతుల్లో సెంచరీ (103 *) చేసింది. భారత్ తరపున టీ20 సెంచరీ సాధించిన తొలి మహిళగా నిలిచింది. హర్మన్ప్రీత్ టీ20లో మెరుగైన రికార్డు కలిగి ఉంది. 96 మ్యాచ్ల్లో ఆరు అర్ధ సెంచరీలు మరియు ఒక సెంచరీతో 1910 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ చేసి 25 వికెట్లు కూడా సాధించింది.