
సిడ్నీ: భారత యువ సంచలనం షెఫాలీ వర్మపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రశంసల వర్షం కురిపించింది. షెఫాలీ ఎల్లప్పుడూ జట్టు కోసం ఆడటానికి ప్రయత్నిస్తుందని, అలాంటి ప్లేయర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుందన్నారు. మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా సిడ్నీ వేదికగా గురువారం ఇంగ్లండ్తో భారత్ సెమీ ఫైనల్ ఆడనుంది. ఈ సందర్భంగా హర్మన్ప్రీత్ మీడియాలో సమావేశంలో పాల్గొంది.
హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... 'షెఫాలీ వర్మ అద్భుతమైన ప్లేయర్. ఆమె జట్టుకు సానుకూల అంశం. క్రీజులో షెఫాలీతో బ్యాటింగ్ చేసేటప్పుడు మనల్ని ప్రేరేపిస్తుంది. మాపై ఉన్న ఒత్తిడిని తొలగిస్తుంది. అలాంటి ప్లేయర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. దేశం కోసం ఆడాలనుకునేవారు ఉత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తారు. జట్టు కోసం పోరాడటాన్ని షెఫాలీ ఆస్వాదిస్తుంది' అని కౌర్ తెలిపింది.
'మేం ఎంతో కాలం నుంచి కలిసి ఆడుతున్నాం. ఇతరుల దగ్గర నుంచి కూడా క్రికెట్ నేర్చుకుంటున్నాం. అందుకే జట్టుగా రాణిస్తున్నాం. అయితే వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నించాలి. నేను మెగా టోర్నీలో ఆకట్టుకోలేకపోయాను. అయినా జట్టు అద్భుతంగా ఆడుతుంది. దాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. అయితే కీలక మ్యాచ్ ముందుండి కాబట్టి మరికొందరు రాణించాల్సి ఉంది' అని హర్మన్ప్రీత్ పేర్కొంది.
'గత సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూశాక సమష్టిగా సత్తాచాటాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పుడు జట్టుగా విజయాలు సాధిస్తున్నాం. మేం కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడట్లేదు. ఇప్పుడు జట్టు సమతూకంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. గతం గురించి కాకుండా ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాం. జట్టుగా మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నా' అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది.
గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే సెమీస్లో ఇంగ్లండ్ను చిత్తుచేసి తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరాలని హర్మన్ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అజేయంగా సెమీస్ చేరగా.. ఇంగ్లండ్ మాత్రం మూడు విజయాలతోనే ఇక్కడి వరకు వచ్చింది. అయితే వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్కు ఒక విషయం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గెలిచిన నాలుగు మ్యాచ్ల్లో భారత్ బౌలింగ్ బలంతో గట్టెక్కింది. బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం భారత్కు ఉంది.