Harmanpreet Kaur: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ పోరుకు టీమిండియా సన్నద్ధమైంది. నేడు(నవంబర్ 2) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ తుదిపోరులో భారత్, దక్షిణాఫ్రికా జట్టు మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానుల ఆశలను పెంచేలా ఉన్నాయి.
గెలుపు అనుభూతిని పొందాలి: హర్మన్ప్రీత్ కౌర్
ఫైనల్ మ్యాచ్కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్ప్రీత్ కౌర్ గత ఫైనల్ పరాజయాల గురించి మాట్లాడుతూ.. ఈ సారి విజయం సాధించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేసింది. " ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో ఓటమిని చవిచూస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. కానీ ఈ సారీ కేవలం గెలుపు అనుభూతిని మాత్రమే పొందాలనుకుంటున్నాం. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైనది, చిరస్మరణీయమైన రోజు కానుంది. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఫైనల్లో మేము మా సర్వశక్తులూ ఒడ్డి పోరాడతాం." అని అన్నారు.

గతం నుంచి పాఠాలు: మూడోసారి ఫైనల్లో భారత్
భారత మహిళల జట్టు ఫైనల్కు చేరుకోవడం ఇది మూడోసారి. 2005 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. 2017 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్లో హర్మన్ప్రీత్ జట్టులో సభ్యురాలిగా ఉంది. ఆస్ట్రేలియాపై 171 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్తో జట్టును ఫైనల్కు చేర్చింది. గతంలో రెండుసార్లు టైటిల్కు చేరువైనప్పటికీ పరాజయం పాలైన అనుభవాన్ని గుర్తు చేసుకున్న హర్మన్ప్రీత్.. ఈసారి చరిత్రను మార్చడానికి టీమిండియా సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
'ఫైనల్ ఆడటం గర్వకారణం'
ప్రతి క్రికెటర్కు ప్రపంచ కప్ ఫైనల్లో ఆడటం ఒక గర్వించదగ్గ క్షణమని హర్మన్ప్రీత్ పేర్కొంది. "ఫైనల్ ఆడటం మా అందరికీ గర్వకారణం. గత రెండు మ్యాచ్ల్లో (సెమీ-ఫైనల్తో సహా) మేము ఆడిన తీరు చూస్తే దేశమంతా మాపై గర్వపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద మ్యాచ్, ఈ అవకాశాన్ని మేము ఆస్వాదించాలనుకుంటున్నాము." అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.
ప్రేరణ కోసం వెతకాల్సిన అవసరం లేదు..
ఫైనల్ వంటి కీలక వేదికపై జట్టును ఎలా ప్రేరేపిస్తారని అడిగిన ప్రశ్నకు హర్మన్ప్రీత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది: "మీరు ప్రపంచ కప్ ఫైనల్ వంటి వేదికపై ఉన్నప్పుడు అంతకంటే పెద్ద ప్రేరణ మరొకటి ఉండదు. మా జట్టు మొత్తం దీనికి పూర్తిగా సిద్ధంగా ఉంది. మేము ఒకరికొకరం అండగా నిలబడ్డాం. ఇది మా జట్టు ఎంత ఐక్యంగా ఉందో చూపిస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఈ తయారీ చాలా కాలం ముందే మొదలైంది." అని తెలిపారు.
చరిత్ర సృష్టించే అవకాశం
భారత్ సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై 339 పరుగుల రికార్డు ఛేదనతో ఫైనల్లోకి ప్రవేశించగా.. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ను 125 పరుగుల భారీ తేడాతో ఓడించింది. సొంత గడ్డపై ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించే సువర్ణావకాశం భారత జట్టుకు లభించింది. ఈ రోజు మహిళల క్రికెట్కు కొత్త ప్రపంచ ఛాంపియన్ దక్కడం ఖాయం.