ముంబై: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 85 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. దీంతో తొలిసారి మెగా టోర్నీ ముద్దాడాలన్న కల అందని ద్రాక్షే అయింది. మహిళలు ఓటమి పాలవ్వడంతో జట్టుతో పాటు భారత అభిమానులంతా బాధపడ్డారు. కొందరైతే ఏకంగా కన్నీరు కార్చారు.
IND vs SA: ఓవైపు వర్షం.. మరోవైపు కరోనా.. తొలి వన్డే మ్యాచ్ అనుమానమే!!
టీ20 ప్రపంచకప్ ముగియడంతో తాజాగా భారత అమ్మాయిల జట్టు స్వదేశానికి చేరుకుంది. అయితే మహిళల జట్టుకు కనీస స్వాగతం లభించలేదు. వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో ఒక్క బీసీసీఐ అధికారి కనబడలేదు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదని సమాచారం తెలుస్తోంది. దీంతో కెప్టెన్కు చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ ఆల్రౌండర్ వేద కృష్ణమూర్తి కూడా విమానాశ్రయంలో విచారంగా కనిపించింది.
మహిళల జట్టుకు స్వాగతం పలికేందుకు బీసీసీఐ అధికారులు ఎవరూ రాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ చేరి స్వదేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలికేందుకు ఎవరూ రారా? అంటూ అభిమానులు బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. అదే పురుషుల జట్టు అయితే ఇలాగే వ్యవహరించేవాళ్లా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్ స్కారర్. ఆసీస్ బౌలర్లలో షుట్ (4/18), జెస్ జొనాసెన్ (3/20) రాణించారు.
మ్యాచ్ అనంతరం హర్మన్ప్రీత్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్లో మా జట్టు ఆటతీరుపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నా. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ బాగా ఆడాం. కీలకమైన ఫైనల్లో మాత్రం ఓడిపోయాం. ఇది చాలా బాధకరం. కీలకమైన మ్యాచ్లో క్యాచ్లు జారవిడిచాం. అయితే ప్రస్తుతం ఉన్న జట్టుపై ఎంతో నమ్మకం ఉంది. రానున్న ఆరు నెలల కాలం మాకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలి' అని అన్నారు.