హైదరాబాద్: గాయం కారణంగా భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉమెన్స్ సూపర్ సిరిస్ టీ20కి దూరమైంది. ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ లీగ్ జరగనుంది. ఈ లీగ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సుర్రే స్టార్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తోంది.
ఇటీవలే ఇంగ్లాండ్లో ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్లో భాగంగా జరిగిన రెండో సెమీ పైనల్లో ఆస్ట్రేలియాపై 171 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా పైనల్కు అర్హత సాధించడంలో కౌర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో హర్మన్ భుజం నొప్పితో బాధపడింది.

ఒకనొక సమయంలో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే ఫైనల్లో ఆడుతుందా? లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఫైనల్ కావడంతో తప్పనిసరిగా ఆడాలని భావించిన హర్మన్ నొప్పిని భరిస్తూ బరిలోకి దిగింది. ఫైనల్లో హర్మన్ 51 పరుగులు చేసి అవుటైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని గత వారంలో మిథాలీ సేన భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే.
బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం అనంతరం హర్మన్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో స్కానింగ్ తీయించుకోగా డాక్టర్లు ఆమెకు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆమె ఆగస్టు 10 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 లీగ్కి కౌర్ దూరమైంది.