
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కియా సూపర్ లీగ్లో భారత మహిళా క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన సోమవారం వెస్టర్న్ స్టార్మ్ జట్టు తరుపున బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
తద్వారా మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్ ఉమెన్గా చరిత్ర సృష్టించింది. తాజాగా భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చెలరేగింది. మంగళవారం లాన్స్షైర్ థండర్స్, సర్రేస్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన హర్మన్ రెచ్చిపోయి ఆడింది.
లాన్స్షైర్ థండర్స్ జట్టు తరుపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ కౌర్.. చివరి ఓవర్లలో సిక్స్, ఫోర్ బాధి ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్లో 21 బంతులు ఎదుర్కొన్న హర్మన్ ప్రీత్ కౌర్ ఒక సిక్స్, 3 ఫోర్లతో 34 పరుగులతో లీగ్ను ఘనంగా ఆరంభించింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే స్టార్స్ 147 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన థండర్స్కు ఓపెనర్ నికోల్ బోల్టన్ (87), హర్మన్ (34 నాటౌట్) పరుగులతో రాణించడంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి మూడు బంతుల్లో థండర్స్ విజయానికి 8 పరుగుల కావాల్సి ఉండగా హర్మన్ ఫోర్, సిక్స్ బాదడంతో అలవోక విజయాన్ని నమోదు చేసింది.
ఈ టోర్నీలో భాగంగా వెస్టర్న్ స్టార్మ్ జట్టుకు ఆడుతున్న మంధాన ఆదివారం తన అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించింది. మంధాన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. తనదైన శైలిలో సిక్స్తో మంధాన హాఫ్ సెంచరీని పూర్తి చేసింది. దీంతో సోఫీ డివైన్(న్యూజిలాండ్)తో కలిసి మంధాన సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.