జట్టు ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నా:
మ్యాచ్ అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్లో మా జట్టు ఆటతీరుపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నా. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ బాగా ఆడాం. కీలకమైన ఫైనల్లో మాత్రం ఓడిపోయాం. ఇది చాలా బాధకరం. కీలకమైన మ్యాచ్లో క్యాచ్లు జారవిడిచాం. అయితే ప్రస్తుతం ఉన్న జట్టుపై ఎంతో నమ్మకం ఉంది. రానున్న ఆరు నెలల కాలం మాకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలి' అని అన్నారు.
షెఫాలీని నిందించలేం:
'దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడాం. భవిష్యత్తులో గొప్పగా రాణిస్తామన్న నమ్మకం నాకుంది. అలీసా హీలీ ఇచ్చిన క్యాచ్ను షెఫాలీ వర్మ నేలపాలు చేసిందని ఆమెను నిందించలేం. 16 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్ ఆడుతున్న షెఫాలీ జట్టు కోసం గొప్పగా పోరాడింది. ఈ వయసులో అంత సానుకూల దృక్పథంతో ఆడడం ఎంతో కష్టం' అని హర్మన్ తెలిపారు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు హీలీ ఇచ్చిన క్యాచ్ను షెఫాలీ జారవిడిచింది. ఇందుకు భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హీలీ చెలరేగి 75 పరుగులు చేసింది.
దీప్తి శర్మ టాప్ స్కోరర్:
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. హేలీ, మూనీ చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్ స్కారర్. ఆసీస్ బౌలర్లలో షుట్ (4/18), జెస్ జొనాసెన్ (3/20) రాణించారు. హేలీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', మూనీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా:
మహిళల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఎంసీజీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ను 86,174 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఐసీసీ మహిళల క్రికెట్లో ఇంత మంది అభిమానులు మైదానానికి తరలిరావడం ఇదే తొలిసారి కావడం విశేషం. పరుగుల పరంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఇదే భారీ గెలుపు.