
మహిళల ప్రీమియర్ లీగ్లో ఓపెనింగ్ గేమ్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న గుజరాత్ జట్టు.. రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. యూపీ వారియర్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ జట్టుకు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లీ (13) ఫర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (46) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కానీ ఆమెకు సహకారం అందించేవారు కరువయ్యారు.
అన్నాబెల్ సదర్లాండ్ (8), సుష్మా వర్మ (9) ఇద్దరూ విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన యాష్లే గార్డనర్ (25) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. గార్డనర్, డియోల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ యూపీ బౌలర్లు ఈ జోడీని విడగొట్టారు. చివర్లో డయాలన్ హేమలత (21 నాటౌట్), స్నేహ్ రాణా (9 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్సెల్టోన్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అంజలి శర్వణి, తహీలా మెక్గ్రాత్ చెరో వికెట్ తీసుకున్నారు.
గుజరాత్ జట్టు తమ తొలి మ్యాచ్లో ముంబై చేతిలో ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముంబై జట్టు 207 పరుగులు చేయగా.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ఏమాత్రం రాణించలేదు. దీంతో 15.1 ఓవర్లలో కేవలం 64 పరుగులకే ఈ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో ఆ జట్టుకు మరో షాక్ కూడా తగిలింది. గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ గాయపడి, రిటైర్డ్ అవుట్గా మైదానాన్ని వీడింది. ఆమె లేకపోవడంతో యూపీ వారియర్స్తో మ్యాచ్లో జట్టు పగ్గాలను స్నేహ్ రాణాకు అప్పగించారు. ఆమె కెప్టెన్సీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.