IND vs PAK: ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా విజయం సాధించడంతో పాటు మైదానంలోనూ.. మైదానం బయట పాక్ ఆటగాళ్లకు ఎదురైన అనుభవాలు చర్చనీయాంశమయ్యాయి. ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ హారిస్ రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు.
హారిస్ రౌఫ్ వివాదాస్పద సైగలు
భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోతున్నప్పటికీ.. హారిస్ రౌఫ్ బౌండరీ లైన్ వద్ద నిలబడి భారత అభిమానులకు 6-0 అంటూ ఒక వివాదాస్పద సైగ చేశాడు. ఈ సైగకు ఉద్దేశం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారత రఫేల్ జెట్లను కూల్చివేసిందనే అబద్ధాన్ని సూచించడం. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత రఫేల్ ను కూల్చేశామని పాక్ అబద్ధాలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని పాక్ క్రికెటర్ ఓ క్రీడా మైదానంలో సూచించడం సిగ్గుచేటు. అయితే నిజానికి ఆ ఆపరేషన్లో భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ అబద్ధపు ప్రచారం చేసి అహంకారంతో ప్రవర్తించిన హారిస్ రౌఫ్ను భారత అభిమానులు ఆటపట్టించడం మొదలుపెట్టారు.

అహ్మదాబాద్లో ఎదురైన అనుభవం
హారిస్ రౌఫ్ కు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇది మొదటిసారి కాదు. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ భారత అభిమానులు అతన్ని 'కోహ్లీ-కోహ్లీ' అని నినాదాలు చేస్తూ ఆటపట్టించారు. ఇప్పుడు దుబాయ్లో జరిగిన మ్యాచ్లోనూ అదే సీన్ పునరావృతమైంది. బౌండరీ వద్ద నిలబడిన రవూఫ్ను చూసి ఫ్యాన్స్ మళ్లీ కోహ్లీ పేరుతో నినాదాలు చేశారు.
2022 టీ20 ప్రపంచ జ్ఞాపకం
ఈ నినాదాలకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. 2022 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు, చివరి ఓవర్లలో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముఖ్యంగా భారత్ గెలవడానికి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సినప్పుడు హారిస్ రౌఫ్ బౌలింగ్కు వచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ అతడి బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టాడు. ఈ సిక్స్లు కేవలం మ్యాచ్ గమనాన్ని మార్చడమే కాకుండా, రౌఫ్ కెరీర్లో ఒక పీడకలగా మిగిలిపోయాయి. ఆ మ్యాచ్లో కోహ్లీ కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి పాకిస్తాన్ను ఓడించాడు. ఈ సంఘటనను గుర్తు చేస్తూ అభిమానులు రౌఫ్ను ఆటపట్టించడం.. అతడి ప్రవర్తనకు తగిన సమాధానమని అనిపిస్తోంది.