Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ స్పందించాడు. ఈ వివాదం ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో హారిస్ రౌఫ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఇదంతా బోర్డు తలనొప్పి
ఆసియా కప్ మ్యాచ్లకు ముందు జరిగిన వివాదం, మ్యాచ్ ను బహిష్కరించాలన్న పిలుపులపై పాక్ క్రికెటర్ హారిస్ రౌఫ్ను ప్రశ్నించగా.. తాను ఈ విషయంపై ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని చెప్పాడు. "ఈ వ్యవహారం నా నియంత్రణలో లేదు. ఇవి బోర్డు తీసుకునే నిర్ణయాలు.. ఇది వారి తలనొప్పి. ఆటగాడిగా నా పని కేవలం మ్యాచ్ ఆడడంపైనే దృష్టి పెట్టడమే. ఈ సమస్యను మేనేజ్మెంట్ చాలా బాగా పరిష్కరించింది." అని హారిస్ రౌఫ్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యల ద్వారా మైదానం బయట జరిగే రాజకీయ పరిణామాలతో ఆటగాళ్లకు సంబంధం లేదని.. వారి దృష్టి కేవలం ఆటపైనే ఉంటుందని ఆయన పరోక్షంగా సూచించాడు.

బ్యాటింగ్పై ఇంకా సందిగ్ధత
యూఏఈపై పాకిస్థాన్ జట్టు ఈజీగా విజయం సాధించినా.. బ్యాటింగ్లో జట్టు ఇంకా నిలకడగా లేదనే విషయం స్పష్టమైంది. సామ్ ఆయుబ్ డకౌట్ కాగా.. ఫఖర్ జమాన్ మాత్రమే 30కి పైగా రన్స్ చేయగలిగాడు. బ్యాటింగ్ లైనప్లోని ఈ లోపాల గురించి ప్రశ్నించినప్పుడు.. హారిస్ రౌఫ్ ఆచితూచి సమాధానం ఇచ్చాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టుతో ప్రస్తుత జట్టును పోల్చడంపై ఆయన స్పందిస్తూ.. "ఎవరు ఆడతారు, ఎవరు ఆడరని చెప్పడం నా పని కాదు. అది కోచ్, కెప్టెన్ల పని. ఒక ఆటగాడిగా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవడం మా బాధ్యత. బ్యాటింగ్ గురించి బ్యాటర్లు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. తదుపరి మ్యాచ్ కు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. కాబట్టి బాగా సిద్ధం అవుతామని ఆశిస్తున్నాం." అని హారిస్ రౌఫ్ సమాధానిమిచ్చాడు. ఈ కామెంట్స్ జట్టులో ఆటగాళ్ల ఎంపికపై తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఇష్టపడలేదని సూచిస్తున్నాయి.
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం సూపర్-4లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 21న భారత్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో హారిస్ రౌఫ్ వ్యాఖ్యలు జట్టులో మైదానం బయట జరిగే వివాదాల ప్రభావంపై స్పష్టతనిచ్చాయి.