
హైదరాబాద్: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పదే పదే భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. అనవసర విషయాల్లో భారత్ను లాగి పలుమార్లు నవ్వులపాలైంది. తాజాగా మరోసారి భారత్పై లేనిపోని ఆరోపణలు చేసి అబాసుపాలైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ -శ్రీలంక సిరీస్ అంతగా విజయవంతం కాకపోవడంతో దాయాదికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరూ సొంత దేశంలో పర్యటించడానికి రాలేకపోవడంతో పిచ్చెక్కి ఉన్న పాక్.. భారత్పై బురదజల్లే ప్రయత్నం చేసింది.
శ్రీలంక జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పది మందిని పాకిస్తాన్ రాకుండా భారత్ అడ్డుకుందని పాక్ మంత్రి ఫావద్ చౌదరీ అసత్య ఆరోపణలు చేశాడు. 'పది మంది లంక క్రికెటర్లు పాక్కు రాకుండా భారత క్రీడా శాఖ ఒత్తిడి చేసింది. పాకిస్థాన్ పర్యటనను వ్యతిరేకించకపోతే ఐపీఎల్లో ఆడనివ్వమని శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరించింది. భారత్ చవకబారు వ్యూహాల కారణంగానే లంక ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాలేదు. భారత్ బెదిరింపులను మనమంతా తీవ్రంగా ఖండించాలి' అంటూ ఫావద్ చౌదరీ ట్వీట్ చేశాడు.
ఫావద్ ఆరోపణలను శ్రీలంక ఖండించింది. ఈ వివాదంపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి ఫెర్నాండో స్పందించారు. 'లంక క్రికెటర్లు పాక్ వెళ్లకుండా భారత్ ఎలాంటి ఒత్తిడి చేయలేదు. 2009లో క్రికెటర్లపై జరిగిన దాడి కారణంగానే పది మంది ఆటగాళ్లు పాక్ పర్యటను ఇష్టపడలేదు. మా ఆటగాళ్లపై బీసీసీఐ ప్రభావం లేదు. పాక్ పర్యటనకు పూర్తిస్థాయి జట్టునే పంపించాం. ప్రస్తుత సిరీస్లో లంక శక్తిమేర ఆడి సిరీస్ గెలుస్తుంది' అని స్పష్టం చేశారు.
లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్కు వెళ్లేందుకు నిరాకరించారు. వీరితో పాటు 10 మంది లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను నిరాకరించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరిస్లో తొలి వన్డే వర్షం కాగా రద్దు కాగా.. సోమవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 67 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
రెండో వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (115) సెంచరీ, ఫకర్ జమన్ (54) హాఫ్ సెంచరీతో రాణించారు. అనంతరం 306 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌటైంది. షెహన్ జయసూర్య (96) సెంచరీ సాధించాడు. ఈ సిరిస్లో చివరిదైన ఆఖరి వన్డే ఈ రోజు ప్రారంభం అయింది.