ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హిట్మ్యాన్ కాదని హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు అందించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. గుజరాత్ టైటాన్స్ నుంచి 'కెప్టెన్ ఒప్పందం'పై ముంబై గూటికి చేరాడని కథనాలు వచ్చిన నేపథ్యంలో హార్దిక్ను స్టేడియంలో హేళన చేస్తూ అవమానిస్తున్నారు.
విరాట్ కోహ్లి విజ్ఞప్తి మేరకు గురువారం జరిగిన ముంబై-ఆర్సీబీ మ్యాచ్లో హార్దిక్కు అభిమానులు కాస్త మద్దతుగా నిలిచారు. కానీ అంతకుముందు మ్యాచ్ల్లో హార్దిక్ టాస్, బ్యాటింగ్, బౌలింగ్కు వచ్చే సందర్భాల్లో హేళన చేశారు. అయితే దీని గురించి ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. ప్రేక్షకులు ఎగతాళి చేస్తున్న హార్దిక్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

''హార్దిక్ సవాళ్లను ఇష్టపడతాడు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదుర్కొంటున్నాడు. ఈ హేళన ఆపండి అంటూ అతను చెప్పే వ్యక్తి కాదు. అతడు ఆస్వాదిస్తున్నాడు. అతడి గురించి తెలిసిన వ్యక్తిగా ఇది చెబుతున్నా అతడు ఛాలెంజ్స్ను ఎంజాయ్ చేస్తాడు. ఫ్యాన్స్ గురించి మనం కంప్లైట్ చేయలేం. వాళ్లు వాళ్ల అభిప్రాయలను వ్యక్తపరుస్తారు. అయితే హార్దిక్ బ్యాటుతో సత్తాచాటి, త్వరలో ప్రజల నుంచి తిరిగి ప్రేమను పొందుతాడని ఆశిస్తున్నా''
''మన కష్టాన్ని, జట్టు కోసం చేసే శ్రమను ప్రజలు తప్పక గుర్తిస్తారు. అయితే మా అభిమానులు కాస్త కఠినంగా ఉంటారు. కానీ అదే సమయంలో గొప్ప ప్రదర్శన చేస్తే మెచ్చుకుంటారు. కాబట్టి ఈ పరిస్థితి మారుతుంది. అది ఇవాళ అవ్వొచ్చు. పోనీ రేపు లేదా ఎల్లుండి.. ఇలా ఎప్పుడైనా కావొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ హార్దిక్ తన బ్యాటింగ్పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాడు. తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. దాని ఫలితం మరోలా వస్తే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇది హార్దిక్కు మాత్రమే, ఇతర ఆటగాళ్లకు కాదు'' అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
వాంఖడే వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో హార్దిక్ పాండ్య ఆరు బంతుల్లో అజేయంగా 21 పరుగులు చేశాడు. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. అంతేగాక సిక్సర్తోనే ముంబై ఇండియన్స్ను విజయతీరాలకు చేర్చాడు. హార్దిక్తో పాటు ఇషాన్ కిషన్ (68; 34 బంతుల్లో, 7x4, 5x6), సూర్యకుమార్ యాదవ్ (52; 19 బంతుల్లో, 5x4, 4x6) దూకుడుగా ఆడారు.