టీమిండియా అభిమానులంతా మరో ప్రపంచ కప్ విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024లో టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న భారత్.. ఇప్పుడు 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మళ్లీ ట్రోఫీని గెలవాలంటే ఏ ఆటగాడు అత్యంత కీలకం అనే దానిపై మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
సూర్య, అభిషేక్ కాదు.. అతడే కీలకం
సాధారణంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంటుంది. వీరిద్దరూ పరుగుల వరద పారించగల కీలక ఆటగాళ్లు కావడం గమనార్హం. అయితే ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఈ ఇద్దరి కంటే మరొక ఆటగాడి ప్రదర్శన అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ సమయంలో జట్టుకు నిలకడైన ప్రదర్శన అందించే ఒక ఆల్రౌండర్ చాలా అవసరం. ఆ లోటును భర్తీ చేయగల ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్యా అని ఇర్ఫాన్ బలంగా నమ్ముతున్నారు.

టీమిండియాను ఛాంపియన్గా మారుస్తాడు..
ఇర్ఫాన్ పఠాన్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో.. హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా సిరీస్కు తిరిగి రావడం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగానే 2026 వరల్డ్ కప్ విజయంలో హార్దిక్ పాండ్యా పాత్ర ప్రాముఖ్యతను ఆయన విశ్లేషించారు. "T20 మ్యాచ్లు, రాబోయే ప్రపంచ కప్లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా అత్యంత కీలకమైన ఆటగాడు. జట్టు అతనిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. హార్దిక్ పాండ్యా, అతనితో పాటు ఆడే మరో ఫినిషర్.. ఈ ఇద్దరి ప్రదర్శనపైనే టీమిండియా మళ్లీ ట్రోఫీని గెలుచుకుంటుందా లేదా అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది." అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
అంటే జట్టుకు అవసరమైన వేగవంతమైన పరుగులను చివరి ఓవర్లలో అందించే 'ఫినిషర్' రోల్ పోషించడంలో హార్దిక్ పాండ్యా ఫామ్ చాలా ముఖ్యమని పఠాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో హార్దిక్ బ్యాటింగ్లో రాణించడంతో పాటు బౌలింగ్లో కీలక వికెట్లు తీయడం జట్టు విజయాన్ని శాసిస్తుంది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. ఆరంభాన్ని భారీ స్కోర్గా మార్చడంలో హార్దిక్ పాండ్యా, మరో ఫినిషర్ పాత్రే కీలకం అని ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశారు. ఈ క్రమంలో, టీమిండియా దృష్టి ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఫామ్, ఫిట్నెస్, అతనితో పాటు మరొక స్థిరమైన ఫినిషర్ను గుర్తించడంపై ఉండాలి.