
హైదరాబాద్: ఓ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను చిక్కుల్లో పడేసిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ను కించపరుస్తూ ట్వీట్ చేశాడని పాండ్యాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఓ రాజస్థాన్ కోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అంబేద్కర్పై వివాదాస్పద ట్వీట్ చేసిన అకౌంట్ నకిలీ అకౌంట్ అని తేలింది.
@sirhardik3777 అకౌంట్ నుంచి 'అంబేద్కర్ ఎవరు.. మన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తేనా లేక రిజర్వేషన్లు అన్న రోగాన్ని మన దేశానికి అంటించిన వ్యక్తా?' అని గతేడాది ఓ ట్వీట్ చేశారు. అప్పట్లో అది వివాదంగా మారింది. దీంతో రాజస్థాన్లోని జలోర్ జిల్లాకు చెందిన రాష్ట్రీయ భీమ్ సేనా సభ్యుడు, న్యాయవాది అయిన మేఘ్వాల్ అనే వ్యక్తి పాండ్యాపై ఫిర్యాదు చేశారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
పాండ్యా వ్యాఖ్యలు ఓ వర్గపు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ అతడు స్థానిక కోర్టుని ఆశ్రయించాడు. అయితే, ఇది హార్దిక్ పాండ్యా అధికారిక అకౌంట్ కాదని తేలింది. నిజానికి పాండ్యా ట్విట్టర్ అకౌంట్ @hardikpandya7తో ఉంది. దీనిని ట్విట్టర్ సంస్ధ కూడా వెరిపై చేసింది.
కాగా, మంగళవారం కోర్టు తీర్పు అనంతరం మేఘ్వాల్ మాట్లాడుతూ పాండ్యా ట్వీట్ విషయం జనవరిలో సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. అంబేద్కర్ లాంటి వ్యక్తిపై ఇలాంటి అమర్యాదపూర్వకమైన వ్యాఖ్యలు సరికావని, విద్వేషాలు రెచ్చగొట్టే, సమాజంలో విభజనను సృష్టించేలా అతని వ్యాఖ్యలున్నాయని మేఘవాల్ తెలిపారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజాన్ని వేరు చేసినట్లు అవుతుందని, ఇలా ఓ వర్గపు ప్రజలను కించపరిచేలా మాట్లాడటం ఎంత మాత్రం సబబు కాదని పేర్కొన్నాడు. పాండ్యా పెద్ద నేరం చేశాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని పేర్కొన్నాడు. అయితే, మేఘవాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఓ ఎస్సీ, ఎస్టీ కోర్టు పాండ్యాపై కేసు నమోదు ఆదేశించింది. దీనిపై పాండ్యా ఏమీ స్పందించలేదు.