హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఇప్పటికే 3-0తో క్లీన్ స్వీప్ చేయగా ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 20న తొలి వన్డే ప్రారంభం కానుంది.
వన్డే సిరిస్కు కాస్తంత విరామం లభించడంతో భారత ఆటగాళ్లు శ్రీలంకలోని పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అక్కడి నుంచే తన తండ్రికి ఓ సర్ ప్రైజ్ బహుమతిని అందజేశాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి తండ్రి హిమాన్షుకి కారు కొనిచ్చాడు.

వివరాల్లోకి వెళితే...
హార్ధిక్, కృనాల్ పాండ్యాలు తండ్రి హిమన్షుకి కారు కొనివ్వాలని అనుకున్నారు. ఇద్దరూ కలిసి తండ్రికి ఎలా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారో వరుసకి సోదరుడైన వైభవ్కి వివరించారు. దీంతో వైభవ్ హార్ధిక్ పాండ్యా తండ్రిని ఓ కార్ల షోరూంకి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో పాండ్యా స్మార్ట్ ఫోన్ వీడియో కాల్ ద్వారా లైన్లోకి వచ్చాడు.
తండ్రిని ఓ కారు ఎంపిక చేయమని అడగ్గా... ఆయన వెంటనే ఎరుపు రంగు కారు బాగుందని తెలిపాడు. దీంతో వెంటనే షోరూం సిబ్బంది ఆ కారు యాజమాని మీరే అని తెలపడంతో హిమాన్షుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు విషయం తెలుసుకున్న హిమన్షు తన కుమారులు ఇచ్చిన సర్ ప్రైజ్కి గాను వీడియో కాల్లో ఉన్న హార్దిక్తో ఐ లవ్ యూ అన్నారు.

ఈ సన్నివేశం మొత్తాన్ని హార్దిక్ పాండ్యా తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'తండ్రి ముఖంలో ఇంత ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మా కోసం ఆయన అన్ని సంతోషాలను వదులుకున్నారు. ఆయన ఇచ్చిన సపోర్టుతోనే ఇదంతా. అందుకే ఆయనకి ఒక చిన్న సర్ప్రైజ్' అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.