
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చివరిగా పాండ్యా భారత జట్టు తరఫున యూఏఈ వేదికగా జరిగిన ప్రపంకప్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచకప్లో హార్ధిక్ పాండ్యా ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతో పాండ్యా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. త్వరలోనే వెస్టిండీస్తో జరగనున్న సిరీస్లో ఆడాలని పాండ్యా భావించినప్పటికీ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. దేశవాళీ టోర్నీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తాజాగా తన ఫిట్నెస్పై స్పందించాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి శ్రమిస్తున్నట్లు చెప్పాడు. అలాగే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో సత్తా చాటడమే లక్ష్యంగా తాను కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
త్వరలో జరగనున్న ఐపీఎల్ 2022లో సత్తా చాటి పూర్తి ఫిట్నెస్తో భారత జట్టులోకి తిరిగి వస్తానని ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండ్యా చెప్పాడు. అందుకే ఐపీఎల్ కోసం ప్రత్యే క ప్రణాళికతో సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ను గెలవడమే తన లక్ష్యమని తెలిపాడు. ఇందు కోసం తాను చాలా కష్టపడుతున్నానని చెప్పాడు. ప్రపంచకప్నకు తన పూర్తి సన్నద్ధతను ఐపీఎల్ నుంచే ప్రారంభించనున్నట్లు హార్దిక్ పాండ్యా తెలిపాడు. కాగా ఐపీఎల్లో ఇంతకాలం ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్యా తొలి సారి వేరే జట్టుకు ఆడబోతున్నాడు. ఈ సారి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్కు పాండ్యా ప్రాతినిధ్యం వహించనున్నాడు. అంతేకాకుండా ఆ జట్టుకు పాండ్యానే కెప్టెన్గా కూడా ఉండనున్నాడు. ఈ మేరకు హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను అహ్మదాబాద్ రిటైన్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా తన కెరీర్లో ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పాండ్యా 31 సగటుతో 532 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 17 వికెట్లు తీశాడు. 63 వన్డే మ్యాచ్ల్లో 32 సగటుతో 1286 పరుగులు చేశాడు. 7 సార్లు హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 57 వికెట్లు తీశాడు. ఇక 54 టీ20 మ్యాచ్ల్లో 20 సగటుతో 553 పరుగులు చేశాడు. 42 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 92 మ్యాచ్లు ఆడిన 28 ఏళ్ల పాండ్యా 27 సగటుతో 1476 పరుగులు చేశాడు. 4 సార్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 42 వికెట్లు తీశాడు.