హైదరాబాద్: బెంగళూరు వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీసేన 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది.
అనంతరం ఆసీస్ నిర్దేశించిన భారీ విజయ లక్ష్యాన్ని చేధించి క్రమంలో భారత బ్యాట్స్మెన్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా బాదిన ఓ సిక్స్ మాత్రం ఓ ప్రేక్షకుడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జాబ్ చేసే 24 ఏళ్ల తోసిట్ అగర్వాల్ కాంప్లిమెంటరీ పాస్తో చిన్నస్వామి స్టేడియంలోని పెవిలియన్ 1లో కూర్చుని మ్యాచ్ను వీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో పాండ్యా బాదిన సిక్స్ అతని వైపు దూసుకొచ్చింది.
ఈ క్రమంలో తోసిట్ అగర్వాల్ చేతులు అడ్డుపెట్టుకుని పాండ్యా బాదిన సిక్సును ఆపేందుకు యత్నించినా వీలు కాలేదు. అది నేరుగా వచ్చి అతడి మూతికి తగిలింది. దీంతో అతడి దవడ పగిలి తీవ్ర రక్త స్రావం కావటంతో స్టేడియం నిర్వాహకులు వెంటనే అతడిని సమీపంలోని హోస్మట్ ఆసుపత్రికి తరలించారు.
తోసిట్ కింది దవడకు తీవ్ర గాయం కావటంతో మధ్య పన్ను కాస్త వదులయ్యిందని, పెదవికి కుట్లు వేసినట్లు డాక్టర్ అజిత్ బెనడిక్ట్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్-ఇండియాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో సురేశ్ రైనా కొట్టిన షాట్కు సతీష్ అనే ఆరేళ్ల కుర్రాడి కాలికి తీవ్రగాయమైన సంగతి తెలిసిందే.